
హైదరాబాద్ నగరంలోని ఫేమస్ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో భక్తి పేరుతో చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపుతోంది. దేవాలయ హుండీ లెక్కింపు సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ విషయం భక్తులను ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురిచేసింది. సాధారణంగా భక్తులు తమ కోరికలు నెరవేరాలని, మొక్కలు మొక్కి.. విశ్వాసంతో హుండీలో కానుకగా నగదు సమర్పిస్తారు. అయితే ఈసారి లెక్కింపులో నిజమైన కరెన్సీ మధ్యలో చిల్డ్రన్స్ బ్యాంక్ పేరుతో ఉన్న నకిలీ నోట్లు బయటపడటం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. 100, 200, 500 రూపాయల విలువలతో ఉన్న ఈ నకిలీ నోట్లు అసలు కరెన్సీతో కలిపి వేయబడినట్లు గుర్తించారు.
ఈ ఘటన భక్తి, విశ్వాసాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. పవిత్ర స్థలాల్లో కూడా ఇలాంటి మోసపూరిత చర్యలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత దిగజారిందో అనిపిస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుడి ముందే నకిలీ నోట్లు వేయడం కేవలం చట్ట విరుద్ధమే కాకుండా నైతికంగా కూడా తప్పిదమని వారు అంటున్నారు. ఇక ఆలయ అధికారులు ఈ ఘటనపై స్పందిస్తూ, భవిష్యత్తులో హుండీ లెక్కింపులో మరింత కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నకిలీ నోట్లు గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలు వినియోగించడం, భద్రతా చర్యలు పెంచడం వంటి చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తున్నారు.