దోశ పిండి ఇలా కలిపితే.. జన్మలో హోటల్‌కు వెళ్ళకర్లేదిక..

Ravi Kiran

23 March 2026

దోశ, ఇడ్లీ పిండి తయారీలో హోటల్ తరహా రుచిని, మెత్తదనాన్ని, క్రిస్పీనెస్‌ని ఇంట్లో సాధించడానికి కీలకమైన చిట్కాలను, కొలతలను ఫుడ్ ఎక్స్‌పర్ట్ వివరించారు.

మినపప్పు ఎంపికలో జాగ్రత్త అవసరం. ఇడ్లీ, దోశ, గారెల కోసం పొట్టు తీసిన గుళ్ళు వాడాలి. పొట్టుతో ఉన్న మినపప్పు అయితే పొట్టును 80 శాతం వరకు తీసేయాలి.

పూర్తిగా తెల్లగా చేయాల్సిన అవసరం లేదు. గారెలకైతే 50 శాతం పొట్టు తీసినా సరిపోతుంది. మినపప్పును 3-4 గంటలు నానబెడితే సరిపోతుంది. పొట్టు పప్పు అయితే 6-7 గంటలు పడుతుంది.

వేగంగా నానబెట్టాలంటే, నానబెట్టే పాత్రలో ఒక ఇనుప వస్తువును వేయవచ్చు. ఇడ్లీల కోసం ఒక గ్లాసు మినపప్పుకు రెండున్నర గ్లాసుల ఉప్పుడు రవ్వ లేదా బియ్యపు రవ్వను వాడవచ్చు.

ఇడ్లీ రవ్వను పిండిలో కలిపి నానబెట్టాలి, విడిగా నీటిలో నానబెట్టకూడదు. బియ్యపు రవ్వను మినపప్పుతో సమానంగా నానబెట్టి రుబ్బుకోవాలి.

బియ్యపు రవ్వ ఆరోగ్యకరమని, ఉప్పుడు రవ్వ కొందరికి తేన్పులు తెప్పించవచ్చని తెలిపారు. రవ్వలోని నీటిని తొలగించడానికి సింథటిక్ బ్లౌజ్ పీస్ వంటి క్లాత్‌లో వేసి పిండటం ద్వారా తక్కువ సమయంలో పిండిలో కలపవచ్చని సూచించారు.

మిక్సీ కన్నా వెట్ గ్రైండర్‌లో రుబ్బితే పిండి నునుపుగా వస్తుంది. మిక్సీలో రుబ్బేటప్పుడు ఐస్ వాటర్ లేదా చల్లటి నీటిని వాడటం వల్ల పిండి వేడెక్కకుండా, నునుపుగా వస్తుందని చిట్కాను పంచుకున్నారు. పిండి రుబ్బిన తర్వాత వెంటనే ఫ్రిజ్‌లో పెడితే గట్టిగా వస్తుంది, కొన్ని గంటలు బయట ఉంచి పులియబెడితే మెత్తని ఇడ్లీలు వస్తాయి.

 క్రిస్పీ దోశల కోసం ఒక గ్లాసు మినపప్పుకు మూడు గ్లాసుల బియ్యం సరైన నిష్పత్తి. దోశ పిండిలో మెంతులు, అటుకులు లేదా శనగపప్పు వేయడం వల్ల రుచి, రంగు, క్రిస్పీనెస్‌ పెరుగుతాయి. శనగపప్పు ముఖ్యంగా దోశకు బంగారు రంగును ఇస్తుంది. వీటిని మినపప్పుతో పాటు నానబెట్టాలి.