ఈ సూపర్ టెక్నిక్‌తో పిల్లల నుంచి ఈజీగా మొబైల్ దూరం చేయొచ్చు.. ఎలాగంటే.?

సైకాలజిస్ట్ సుధీర్ చంద్ర ప్రకారం, పిల్లల్లో మొబైల్ వ్యసనానికి ప్రధాన కారణం తల్లిదండ్రుల అలవాట్లే. 0-2 సంవత్సరాల పిల్లలకు స్క్రీన్ టైమ్ అస్సలు ఇవ్వకూడదు. 3-12 సంవత్సరాల వారికి పేరెంటల్ కంట్రోల్ యాప్స్‌తో ఒక గంట పాటు విద్యాపరమైన కంటెంట్‌ను మాత్రమే అనుమతించాలి.

ఈ సూపర్ టెక్నిక్‌తో పిల్లల నుంచి ఈజీగా మొబైల్ దూరం చేయొచ్చు.. ఎలాగంటే.?
Children With Mobile Phone

Updated on: Mar 18, 2026 | 12:48 PM

ప్రస్తుతకాలంలో పిల్లల్లో మొబైల్ వ్యసనం తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే ప్రధాన సమస్యగా మారింది. సైకాలజిస్ట్ సుధీర్ చంద్ర ఈ విషయమై విలువైన పరిష్కారాలను అందించారు. మొబైల్ వ్యసనం అనేది ఫోన్ వల్ల కలిగే సమస్య కాదని, అది ఒక వస్తువు మాత్రమేనని, దానిని ఎలా ఉపయోగించాలో తెలియకపోవడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యసనం పిల్లల నుంచి పుట్టుకురాదని, చాలా సందర్భాలలో తల్లిదండ్రుల నుంచే మొదలవుతుందని ఆయన వివరించారు.

తల్లిదండ్రులు తమ పనులను సులభతరం చేసుకోవడానికి లేదా తాత్కాలికంగా పిల్లల నుంచి విరామం పొందడానికి మొబైల్‌ను ఒక సాధనంగా ఉపయోగిస్తుంటారు. దీనివల్ల పిల్లలు తెలియకుండానే మొబైల్‌కు అలవాటు పడతారు. పేరెంటింగ్ అంటే సహనం అని, పిల్లల వెంట పడి అన్నం తినిపించడానికి లేదా వారితో సమయం గడపడానికి బదులు మొబైల్ ఇవ్వడం సరైన పద్ధతి కాదని ఆయన ఉదహరించారు. టీవీ లేదా మొబైల్ ముందు పిల్లలు గంటలు గంటలు గడపడం వల్ల, వారి వ్యక్తిగత అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది.

మార్గదర్శకాలు ఇలా..

  • 0-2 సంవత్సరాల వయస్సు: ఈ వయస్సు పిల్లలకు స్క్రీన్ టైమ్ అస్సలు ఇవ్వకూడదు. టీవీ అయినా, మొబైల్ అయినా వారికి చూపించకూడదు. ఎందుకంటే ఇది వారి మానసిక ఆరోగ్యానికి, కంటి చూపుకు హానికరం. చిన్న వయస్సులోనే భావోద్వేగ అస్థిరతకు దారితీసి, తాత్కాలిక ఆనందాల కోసం చూసేలా చేస్తుంది. రంగుల ప్రపంచానికి అలవాటు పడితే, సాధారణ జీవితాన్ని ఆస్వాదించలేరని ఆయన అన్నారు.
  • 3-12 సంవత్సరాల వయస్సు: ఈ వయస్సు పిల్లలకు మొబైల్ ఇవ్వవచ్చు, కానీ ఖచ్చితమైన నియంత్రణతో. రోజుకు ఒక గంట మాత్రమే స్క్రీన్ టైమ్ అనుమతించాలి. టెంపుల్ రన్, క్యాండీ క్రష్, పబ్జీ వంటి వినోదాత్మక గేమ్స్‌కు బదులుగా, మెదడుకు పదును పెట్టే పజిల్స్ లేదా విద్యాపరమైన యాప్‌లను ప్రోత్సహించాలి. “పేరెంటల్ కంట్రోల్ యాప్స్” ఉపయోగించి, పిల్లలు ఎంత సమయం మొబైల్ వాడుతున్నారు. ఏ రకమైన కంటెంట్ చూస్తున్నారనేది తల్లిదండ్రులు పర్యవేక్షించాలి. మొబైల్ వాడకాన్ని నియంత్రించడం కంటే పర్యవేక్షించడం ముఖ్యం. సాంకేతికత నుంచి పిల్లలను పూర్తిగా దూరం చేయడం ప్రస్తుత కాలంలో సాధ్యం కాదు, కానీ దానిని సరైన పద్ధతిలో ఉపయోగించేలా మార్గనిర్దేశం చేయాలి.
  • టీనేజ్ వయస్సు: 14-15 సంవత్సరాల వయస్సు వారికి మొబైల్ వాడకాన్ని నియంత్రించడం కష్టం. ఈ వయస్సులో వారిని బలవంతంగా నియంత్రిస్తే, అది ప్రతిఘటనకు దారితీస్తుంది. చిన్నప్పటి నుంచే సరైన విద్య, అవగాహన కల్పించడం ముఖ్యం. పిల్లలు తల్లిదండ్రుల మాటలను వినడం కంటే వారిని అనుసరిస్తారని సుధీర్ చంద్ర నొక్కి చెప్పారు. “పిల్లలు మన అద్దాలు” అన్నట్లుగా, తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తే పిల్లలు కూడా అలాగే చేస్తారు. ఉదాహరణకు, తల్లిదండ్రులు ఉదయాన్నే నిద్రలేస్తే పిల్లలు కూడా లేస్తారు. కాబట్టి, మొబైల్ వాడకంలో తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలి. సరైన అవగాహన, సహనం, పర్యవేక్షణతో పిల్లలను మొబైల్ వ్యసనం బారి నుంచి కాపాడవచ్చు.
Follow Us