
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు.. వదల బొమ్మాళి వదల అంటూ టాలీవుడ్ను వెంటాడుతోంది. దీనిలో భాగంగా విచారణకు రావాలంటూ.. దగ్గబాటి రానా, ప్రకాష్రాజ్, మంచులక్ష్మికి తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు మనీలాండరింగ్ మేటర్లో గూగుల్, మెటాలపై ఈడీ కొరడా ఝళిపించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన దర్యాప్తును ఈడీ అధికారులు స్పీడప్ చేశారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసిన ఈడీ, తాజాగా టెక్ దిగ్గజాలు గూగుల్, మెటాలకు కూడా సమన్లు పంపింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో గూగుల్, మెటాలను విచారించనుంది ఈడీ. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, షేర్చాట్, స్నాప్చాట్ ఇలా ఏ యాప్ ట్రెండింగ్లో ఉంటే.. అందులో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారు సెలబ్రిటీలు. ఈ క్రమంలో విచారణలో భాగంగా గూగుల్, మెటాకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని టాలీవుడ్ ప్రముఖ నటీనటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని దగ్గుబాటి రానాను ఆదేశించింది. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని ప్రకాష్రాజ్కు, ఆగస్టు 13న ఎంక్వైరీకి రావాలని మంచులక్ష్మికి నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్లతో జరిగిన అగ్రిమెంట్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు తీసుకుని రావాలని టాలీవుడ్ సెలబ్రిటీలను ఆదేశించింది. ఇక ఇదే కేసులో పేర్లున్న మిగతా నటీనటులకు సైతం దశలవారీగా సమన్లు జారీ చేయనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంలో మొత్తం 29 మంది నటీనటులతో పాటు కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సలర్లపై విచారణ జరుగుతోంది. ఆన్లైన్ బెట్టింగ్పై పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, విశాఖపట్నంలో పోలీసులు నమోదు చేసిన FIRల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి విచారిస్తోంది.
బెట్టింగ్ యాప్ల కేసులో గూగుల్, మెటా సంస్థలకు ఈడీ సమన్లు జారీ చేసింది. జులై 28న ఆయా కంపెనీల ప్రతినిధులు తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ బెట్టింగ్ యాప్లతో మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. తాము విచారణ చేస్తున్నప్పటికీ.. గూగుల్, మెటా సంస్థలు ఇలాంటి యాప్లను తమ ప్లాట్ఫామ్లపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. ఈ టెక్ కంపెనీలు బెట్టింగ్ యాప్ల ప్రకటనలకు స్లాట్లు కేటాయించడమే గాక, వెబ్సైట్ల లింక్లను కూడా అందుబాటులో ఉంచుతున్నాయని ఈడీ పేర్కొంది.
బెట్టింగ్స్ యాప్స్ వల్ల తెలంగాణలో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆన్లైన్ యాప్స్ను విచ్చలవిడిగా ప్రమోట్ చేయడంతో ప్రజలు కూడా ఆకర్షితులై వాటిలో డబ్బులు పెట్టి నష్టపోయారు. కొందరు లక్షలాది రూపాయలు కోల్పోయారు. దీంతో బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ప్రమోటర్స్గా ఉన్న సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ECIR నమోదు చేసింది. ఇది పోలీసులు నమోదు చేసే ఎఫ్ఐఆర్ లాంటిదే. బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ చేసినందుకు కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఈడీ గుర్తించి ఈసీఐఆర్ నమోదు చేసింది. మనీ లాండరింగ్ కోణంలో కూడా ఈడీ దర్యాప్తు సాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి