
నేపాల్లో సంభవించిన తీవ్ర ప్రకృతి విపత్తు నుంచి డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్రెడ్డి, ఆయన సతీమణి సురక్షితంగా బయటపడ్డారు. కైలాస్ మానస సరోవర యాత్రను పూర్తి చేసుకుని ఆదివారం హైదరాబాద్కు చేరుకున్న వారికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నేపాల్లో తాము ప్రత్యక్షంగా చూసిన విపత్తు పరిస్థితులను సతీష్రెడ్డి వివరించారు. ఎమ్మెస్ రామారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి సుమారు 31 మంది సభ్యులతో కైలాస్ మానస సరోవర యాత్రకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారని చెప్పారు. భగవంతుడి దయతో తమ బృందం ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా యాత్రను పూర్తి చేసుకుని క్షేమంగా హైదరాబాద్కు చేరుకుందని పేర్కొన్నారు. కైలాస్ పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేసే సమయంలో అనేక ఆధ్యాత్మిక అనుభూతులు కలిగాయని సతీష్రెడ్డి గుర్తుచేసుకున్నారు. యాత్రలో భాగంగా నేపాల్లోని కొన్ని ప్రాంతాలను ముందుగానే సందర్శించి అక్కడి నుంచి బయలుదేరినట్లు తెలిపారు. తాము ఆ ప్రాంతాలను విడిచిన కొద్దిసేపటికే అక్కడ ప్రకృతి ప్రకోపం మొదలవడంతో పెద్ద ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డామని చెప్పారు.
ముఖ్యంగా త్రిశూల్ నదిలో ఒక్కసారిగా వరద ప్రవాహం ఉధృతం కావడంతో పరిస్థితి తీవ్ర భయానకంగా మారిందని ఆయన వివరించారు. భారీగా వరద నీటితో పాటు బురద, పెద్ద రాళ్లు కొట్టుకురావడంతో నది పరివాహక ప్రాంతాల్లో తీవ్ర నష్టం సంభవించిందన్నారు. వరద ధాటికి పలు భవనాలు దెబ్బతినడంతో పాటు కొన్ని నిర్మాణాలు పూర్తిగా కొట్టుకుపోయాయని తెలిపారు. అదే సమయంలో అక్కడి ప్రజలతో పాటు చైనాకు చెందిన ఇమిగ్రేషన్ కేంద్రం వద్దకు వెళ్లిన పలువురు కూడా ప్రమాదంలో చిక్కుకున్నారని సతీష్రెడ్డి చెప్పారు. పరిస్థితులు ఒక్కసారిగా అదుపు తప్పడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. నేపాల్ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ప్రాణనష్టం సంభవించిందని, పలువురు ఆచూకీ లేకుండా పోయారని సతీష్రెడ్డి తెలిపారు. వేలాది మంది ప్రజలు వరదలు, ప్రకృతి విలయం కారణంగా తీవ్రంగా ప్రభావితమైనట్లు చెప్పారు.
నేపాల్లో చిక్కుకున్న భారతీయుల క్షేమంపై భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. అవసరమైన సహాయక చర్యలు చేపడుతూ, అక్కడ ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి అధికారులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సతీష్రెడ్డి సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, బాధిత కుటుంబాలకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు