
కన్నతల్లి కాదనుకుని వదిలేసినా.. మానవత్వం ఆ పసిప్రాణాన్ని అక్కున చేర్చుకుంది. పుట్టిన కొద్ది గంటల్లోనే బస్టాండ్ మరుగుదొడ్డిలో అనాధగా పడివున్న ఓ పసికందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పునర్జన్మను ప్రసాదించారు. 37 రోజుల పాటు కంటికి రెప్పలా చూసుకుని, ప్రాణాలు నిలబెట్టడమే కాకుండా.. ఆ చిన్నారికి ఒక పేరు, ఒక గుర్తింపును ఇచ్చి కొత్త జీవితానికి బాటలు వేశారు.
ఏప్రిల్ 23న సిరిసిల్ల కొత్త బస్టాండ్లోని మరుగుదొడ్డిలో ఒక నవజాత శిశువు ఏడుపు విన్న స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, వైద్య సిబ్బంది కలిసి ఆ చిన్నారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ పాప బరువు చాలా తక్కువగా ఉండటంతో పాటు, ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. దీంతో ఆసుపత్రి వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో అత్యవసర చికిత్స ప్రారంభించారు.
రోజులు గడిచేకొద్దీ ఆ చిన్నారి ఆసుపత్రి సిబ్బందికి ఎంతో దగ్గరైంది. వైద్యులు, నర్సులు తమ విధిగా కాకుండా, ఒక తల్లి లాంటి మమకారంతో ఆ పసికందును సంరక్షించారు. పాలు పట్టించడం దగ్గర నుండి ప్రతి నిమిషం ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దాదాపు 37 రోజుల నిరంతర చికిత్స, సేవల తర్వాత ఆ చిన్నారి మరణంతో పోరాడి గెలిచింది. ఇప్పుడు పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా నవ్వులు చిందిస్తోంది.
డిశ్చార్జ్ సమయం రానేవచ్చింది.. కానీ చిన్నారితో ఏర్పడిన బంధాన్ని గుర్తుంచుకునేలా ఆసుపత్రి సిబ్బంది ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. వార్డులోనే నామకరణ వేడుకను నిర్వహించి, ఆ పాపకు ‘ఆదర్శ’ అని పేరు పెట్టారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, వాటన్నింటినీ అధిగమించి అందరికీ ఆదర్శంగా నిలవాలనే ఆకాంక్షతో ఈ పేరు పెట్టినట్లు వైద్యులు తెలిపారు.
ఆ తర్వాత చట్టపరమైన నిబంధనల ప్రకారం పాపను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) అధికారులకు అప్పగించారు. అధికారులు ఆ చిన్నారిని సురక్షితంగా శిశుగృహ కేంద్రానికి తరలించి, భవిష్యత్తులో అవసరమైన సంరక్షణ, విద్య, భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టారు. కన్నవారే వద్దనుకున్న పసిప్రాణానికి కొత్త జీవితాన్ని అందించిన సిరిసిల్ల వైద్య బృందం మానవతా దృక్పథంపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..