Cyber Crime: సిమ్ కార్డు పోయినా బ్లాక్ అయినా వెంటనే వారికి ఫోన్ చేయండి.. లేదంటే అంతే సంగతులు..

|

Jan 21, 2021 | 1:32 PM

Cyber Crime: సిమ్ స్వాప్ చేస్తూ ప్రజల సొమ్మును కొల్లగొడుతున్న మిరారోడ్డు గ్యాంగ్‌ ఆటకట్టించారు నగర పోలీసులు. ముఠాలోని ఐదుగురిని పోలీసులు..

Cyber Crime: సిమ్ కార్డు పోయినా బ్లాక్ అయినా వెంటనే వారికి ఫోన్ చేయండి.. లేదంటే అంతే సంగతులు..
Follow us on

Cyber Crime: సిమ్ స్వాప్ చేస్తూ ప్రజల సొమ్మును కొల్లగొడుతున్న మిరారోడ్డు గ్యాంగ్‌ ఆటకట్టించారు నగర పోలీసులు. ముఠాలోని ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారికోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా, ఈ గ్యాంగ్‌ దోపిడీలకు సంబంధించి గురువారం నాడు సైబరాబాద్ సీపీ సజ్జనార్ కీలక విషయాలు వెల్లడించారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన సీపీ.. వారి దోపిడీ తీరును వివరించారు. ఈ కేసులో నైజీరియాకు చెందిన జేమ్స్ ప్రధాన నిందితుడు అని సీపీ వెల్లడించారు. ఈ కేసులోనే కాకుండా పలు సైబర్ క్రైమ్ కేసుల్లోనూ జేమ్స్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు సీపీ ప్రకటించారు.

కాగా, గతేడాది జూన్, అక్టోబర్ నెలల్లో వచ్చి రెండు ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేశామని చెప్పిన సీపీ.. నిందితులు సిమ్ స్వాప్ చేస్తూ ప్రజల సొమ్మును కాజేస్తున్నట్లు గుర్తించామన్నారు. సిమ్ కార్డ్‌ను బ్లా్క్ చేసి, ఆపై కొత్త సిమ్ కార్డును తీసుకుని, బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బులను దుండగులు ఖాళీ చేశారని సీపీ సజ్జనార్ వివరించారు. నైజీరియాలో ఉన్న జేమ్స్ ప్రజలకు ఫిషింగ్ మెయిల్స్ పంపి బ్యాంక్ డీటెయిల్స్, రిజిస్టర్ మొబైల్ నెంబర్స్‌ను సేకరించేవాడన్నారు. అలా జేమ్స్ ఇచ్చిన సమాచారంతో ముంబైలో ఉన్న మిగతా నిందితులు సిమ్ స్వాప్ చేసి డబ్బులు కాజేసేవారు. మొబైల్‌కి వచ్చిన బ్యాంక్ ఓటీపీలు ఆధారంగా డబ్బులను ముఠా సభ్యులు దోచుకునేవారు.

ఎలా దోచేస్తారంటే…
ఈ మిరారోడ్డు గ్యాంగ్ 2011 నుండి సిమ్ స్వాప్ దందా చేస్తూ డబ్బులు కాజేస్తున్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ ముఠా సభ్యులు ముందుగా వివిధ సంస్థల ఆర్థిక లావాదేవీలు చేస్తున్న ఫోన్ నెంబర్లను టార్గెట్ చేస్తారు. ఆపై మొబైల్ సిమ్‌ను బ్లాక్ చేస్తారు. అదే సిమ్‌ను ఫేక్ డాక్యూమెంట్లతో యాక్టీవ్ చేస్తారు. అలా ఆ నెంబర్‌కు లింకప్ అయిన అకౌంట్ల నుంచి డబ్బులను కాజేస్తారు. ఈ ముఠా నిందితులకు దేశవ్యాప్తంగా అకౌంట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దేశంలో కాజేసిన డబ్బులను నైజీరియాలో ఉన్న జేమ్స్‌కి బిట్ కాయిన్స్, హవాలా ద్వారా పంపిస్తున్నారు. కాగా, నిందితుల దగ్గర నుంచి 40 ఫేక్ ఆధార్ కార్డులు, నాలుగు రబ్బర్ స్టాంప్‌లు, 15 మొబైల్ ఫోన్లు, వివిధ సంస్థల పేరుతో ఉన్న లెటర్ ప్యాడ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రజలు ఇవి పాటిస్తే బెటర్: సీపీ సజ్జనార్
అగంతకులు పంపించే ఫిషింగ్ మెయిల్స్‌ని ప్రజలెవరూ ఓపెన్ చేయకూడదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. సిమ్‌ని, అకౌంట్స్‌ని అప్ గ్రేడ్ చేస్తామని ఎవరైనా కాల్స్ చేస్తే నమ్మకూడదన్నారు. ఒకవేళ ఎవరి సిమ్ కార్డు పోయినా.. బ్లాక్ అయినా నెట్‌వర్క్ కస్టమర్ కేర్‌కి సమాచారం అందించాలని ప్రజలకు సీపీ సూచించారు. బ్యాంక్ అకౌంట్స్‌కి, ఆర్థిక లావాదేవీలకు ప్రత్యేక మొబైల్ నెంబర్‌ని ఉపయోగిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.