ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. కాలు కోల్పోయినందుకు వ్యక్తికి రూ.89 లక్షల పరిహారం

ఆర్టీసీ బస్సు ఢీకొనడం వల్ల కాలు కోల్పోయినందుకు ఓ వ్యక్తికి ట్రైబ్యునల్ రూ.89 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు టీజీఎస్‌ఆర్టీసీకి ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. బ్యాంకులో పనిచేస్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో గాయాలయ్యాయి.

ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. కాలు కోల్పోయినందుకు వ్యక్తికి రూ.89 లక్షల పరిహారం
Money

Edited By:

Updated on: Apr 08, 2026 | 7:25 AM

2018లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం… ఓ కుటుంబాన్ని ఆర్థికంగా, వ్యక్తిగతంగా కుదేలు చేసింది. బ్యాంక్ ఉద్యోగిగా స్థిర జీవితం గడుపుతున్న వ్యక్తి… ఒక్క ప్రమాదంతోనే జీవితాంతం మారిపోయింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు తన కాలును కోల్పోయాడు. ఈ ఘటన తర్వాత ఉద్యోగానికీ దూరమై ఆదాయం లేకుండా పోయింది. దీంతో న్యాయం కోసం సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. హైదరాబాద్‌ కొత్తపేటకు చెందిన సీహెచ్ మహేశ్వరరావు.. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పనిచేస్తూ సాధారణ జీవితం గడుపుతున్నాడు. 2018 అక్టోబర్ 31న తన స్నేహితుడితో కలిసి బైక్‌పై ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అతనికి తీవ్రమైన గాయాలు అయ్యాయి.

ఆసుపత్రికి తరలించిన తర్వాత పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు అతని ఎడమ కాలును తొలగించాల్సి వచ్చింది. ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యానికి గురైన మహేశ్వరరావు… తిరిగి తన ఉద్యోగంలో చేరలేకపోయాడు. జీవనోపాధి కోల్పోయిన అతను.. పరిహారం కోసం కోర్టు తలుపు తట్టాడు. ఈ కేసును విచారించిన ట్రైబ్యునల్‌… బాధితుడి పరిస్థితిని, వైద్య ఖర్చులను, భవిష్యత్తు ఆదాయ నష్టాన్ని పరిగణలోకి తీసుకుంది. చివరకు మహేశ్వరరావుకు న్యాయం చేస్తూ… దాదాపు రూ.89 లక్షల( 88,94,658) పరిహారం చెల్లించాలని టీజీఎస్ఆర్టీసీకి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కేసు దాఖలు చేసిన తేదీ నుంచి తీర్పు అమలు అయ్యే వరకు 9 శాతం వడ్డీతో కూడిన మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు రోడ్డు ప్రమాదాల్లో బాధితుల హక్కులను కాపాడటంలో కోర్టుల పాత్ర ఎంత కీలకమో మరోసారి రుజువు చేసింది.

 

Follow Us