Coronavirus: కరోనా వైరస్ వ్యాప్తి.. సంచలన విషయాలు వెల్లడించిన సీసీబీఎం సీఈఓ మధుసూదన రావు..

|

Apr 17, 2021 | 2:23 PM

Coronavirus: తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంది. వారం రోజుల వ్యవధిలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య వేలకు చేరింది.

Coronavirus: కరోనా వైరస్ వ్యాప్తి.. సంచలన విషయాలు వెల్లడించిన సీసీబీఎం సీఈఓ మధుసూదన రావు..
Follow us on

Coronavirus: తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంది. వారం రోజుల వ్యవధిలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య వేలకు చేరింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని కీలక సూచనలు చేస్తోంది. ఇదిలాఉంటే.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సీసీఎంబీ సీఈవో డాక్టర్ మధుసూదన రావు సంచలన విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్ గాలి ద్వారా విస్తరిస్తుందని సీసీఎంబీ పరిశోధనల్లో స్పష్టమైందన్నారు. గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. దగ్గు, తుమ్ములు ద్వారానే కాకుండా వైరస్ ఉన్న వ్యక్తి మాట్లాడిన శ్వాస ద్వారా కూడా వైరస్ గాలిలో విస్తరిస్తోందన్నారు. వైరస్ ఉన్న వ్యక్తి నుంచి గాలి లోనికి వచ్చిన కరోనా వైరస్.. ఆ తరువాత కొన్ని గంటల పాటు గాలిలోనే విస్తరిస్తోందని మధుసూదన రావు తెలిపారు. నాలుగు గోడల మధ్య ఉన్న ఏ ప్రాంతంలోనైనా గంటల పాటు గాలిలో వైరస్ ఉన్నట్లు తమ పరిశోధనల్లో స్పష్టమైందని డాక్టర్ మధుసూదన రావు వెల్లడించారు.

గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందడం వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఇక సినిమా థియేటర్స్, మాల్స్, హోటల్స్, మెట్రో రైల్స్, ఇలా సమూహంగా ఉన్న పరిస్థితులే వైరస్ విస్తరణకు ప్రధాన కారణం అని మధుసూదన రావు తెలిపారు. ఎంత దూరం వరకు గాలిలో వైరస్ ప్రయాణిస్తోందనే దానిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి రెండు మీటర్ల భౌతిక దూరం తప్పనిసరి చేసుకోవాలని సూచించారు. కరానా రోగులు ఉపయోగించిన గదులు, బాత్రూం లోనికి వెళ్లినా వైరస్ సోకే ప్రమాదం ఖచ్చితంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. కరోనా వైరస్ గాలి ద్వారా విస్తరిస్తున్నందున మాస్క్ ఒక్కటే ప్రధాన మార్గం అని తేల్చి చెప్పారు. కరోనా.. సంవత్సరం, రెండు సంవత్సరాల్లో పోయే వైరస్ కాదని, కొన్ని దశాబ్దాల పాటు మనతోపాటే ఉండిపోయే వైరస్ అని అన్నారు. వైరస్‌ను ఎదుర్కోవడానికి శరీరంలో యాంటీబాడీస్ పెంచుకోవడమే ప్రధాన మార్గం అని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ను ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని సూచించారు. యాంటీబాడీస్ పెరగడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. గతంలో చిన్న పిల్లలకు వైరస్ సోకకపోయినా.. ఇప్పుడు చిన్న పిల్లలను సైతం వెంటాడుతోందన్నారు. పెరుగుతున్న కేసుల తీవ్రత చిన్న పిల్లల పైన కూడా ప్రభావం చూపుతోందన్నారు.

Also read:

NTPC Recruitment 2021: పరీక్ష లేకుండానే ఎన్టీపీసీలో ఉద్యోగ అవకాశాలు.. మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే..

Co-Director Satyam Death: మరో సినీ ప్రముఖుడిని మింగేసిన కరోనా… ప్రముఖ కో డైరెక్టర్ సత్యం చికిత్స పొందుతూ మృతి