
తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడి గుడ్ల ధరలు గత కొద్దిరోజులుగా భారీగా పెరుగుతున్నాయి. వరుస పండుగల కారణంగా చికెన్, గుడ్లకు ఒక్కసారిగా భారీగా డిమాండ్ పెరిగింది. ఉత్పత్తి తక్కువగా ఉండగా.. సరఫరా ఎక్కువగా ఉంది. డిమాండ్కు తగ్గట్లు ఉత్పత్తి లేకపోవడంతో గత నెల రోజులుగా వీటి ధరలు ఆమాంతం పెరిగాయి. చికెన్, గుడ్ల ధరలు మరింత ప్రియం కావడంతో సామాన్యులపై భారం మరింత పెరిగింది. వచ్చే నెలలో సంక్రాంతి ఉండటంతో ఇంకో నెల పాటు ధరలు ఇలాగే కొనసాగే అవకాశముంది. మరింత పెరిగే అవకాశం ఉంది తప్పితే తగ్గే ఛాన్స్ అసలు కనిపించడం లేదు.
చికెన్, గుడ్ల ధరలు పెరగడం విద్యార్థులపై ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం పథకంపై దీని ఎఫెక్ట్ పడింది. గుడ్ల ధరలు పెరగడంతో మధ్యాహ్న భోజనం అందించే వంట కార్మికులు విద్యార్థులకు గుడ్డు అందించడం లేదు. దీంతో పోషకాలు అందించే గుడ్డుకు విద్యార్థులు దూరమవుతున్నారు. కొన్ని చోట్ల గుడ్డుకు బదులు వంట కార్మికులు అరటిపండు అందిస్తున్నారు. గుడ్ల ధరలు పెరగడం వల్ల తమకు భారమవుతుందని, ప్రభుత్వం తమకు ఇచ్చే బడ్జెట్ను పెంచితే కానీ తాము అందించే పరిస్థితి లేదని వంట కార్మికులు వాపోతున్నారు. ఏపీలోని అక్కడి ప్రభుత్వం గుడ్లను సరఫరా చేస్తుందని, తెలంగాణలో కూడా అలా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బల్లులు కూడా సకాలంలో రావడం లేదని, దానితో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నట్లు కార్మికులు చెబుతున్నారు. ప్రస్తుతం వంట కార్మికులకు ప్రభుత్వం రూ.3 వేల గౌరవ వేతనం చెల్లిస్తుంది. ఇక గుడ్డుకు రూ.6 మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ప్రస్తుతం ఒక గడ్డు ధర రూ.10 వరకు చేరుకుంది. హోల్సేల్ ధర రూ.7.50 పలుకుతుండగా.. దుకాణాదారులు రూ.8కి విక్రయిస్తన్నారు. ఒక కొంతమంది రిటైలర్లు రూ.10కి కూడా విక్రయిస్తున్నారు. ప్రభుత్వం వంట కార్మికులకు గుడ్లకు రూ.6 మాత్రమే చెల్లించడం వల్ల విద్యార్థులు దూరమవుతున్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వ సిద్దమవుతోంది. ఈ క్రమంలో అయినా సరుకుల కోసం తమకు ఇచ్చే సొమ్మును పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.