
పెద్దపల్లి జిల్లా ఓదెలలో నాగుల పంచమి పర్వదినం సందర్భంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. పార్వతి శంభు లింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో భక్తులు పూజలు నిర్వహిస్తున్న సమయంలో నాగుపాము ప్రత్యక్షమవడంతో భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. నాగదేవత తమ పూజలకు మెచ్చి స్వయంగా దర్శనమిచ్చిందని పలువురు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
నాగుల పంచమి సందర్భంగా ఆలయంలోని పుట్ట వద్ద మహిళలు భక్తిశ్రద్ధలతో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అదే సమయంలో నాగదేవత విగ్రహం సమీపంలోకి ఓ నాగుపాము రావడంతో అక్కడున్న భక్తుల్లో ఉత్కంఠ నెలకొంది. పూజలు జరుగుతున్న సమయంలోనే నాగుపాము ప్రత్యక్షం కావడంతో ఈ ఘటనను భక్తులు అత్యంత భక్తిభావంతో చూశారు.
నాగదేవత తమ పూజలకు మెచ్చి స్వయంగా దర్శనమిచ్చిందని పలువురు భక్తులు భావించారు. దీంతో ఆలయ ప్రాంగణంలో జయజయధ్వానాలు మార్మోగాయి. ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. మహిళలు కొబ్బరికాయలు కొట్టి, హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగుపామును చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరడంతో ఆలయ పరిసరాల్లో కొంతసేపు సందడి నెలకొంది.
సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకున్నాడు. అనంతరం దానిని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టాడు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, నాగుల పంచమి రోజునే నాగుపాము ఆలయంలో ప్రత్యక్షం కావడం విశేషంగా మారింది. ఇదిలావుంటే అనుకోకుండా జనావాసాల్లోకి వచ్చిన పాములకు దగ్గరగా వెళ్లకుండా, పూజల పేరుతో పామును తాకే ప్రయత్నం చేయకుండా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..