Collectors Conference: పల్లె పల్లెలో కాంగ్రెస్ ‘ప్రజా పాలన’.. జిల్లా ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

|

Dec 24, 2023 | 4:35 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్‌పీల సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు హామీల అమలుపై కలెక్టర్లకు సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Collectors Conference: పల్లె పల్లెలో కాంగ్రెస్ ప్రజా పాలన.. జిల్లా ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
Cm Revanth Reddy Collectors Coference
Follow us on

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్‌పీల సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం… ఇప్పటికే హైదరాబాద్ లోని మహాత్మ జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఈ కలెక్టర్ల సమావేశంలో సీఎం ప్రకటించారు. దీనితోపాటు, ఆర్థిక సాధికారిత కల్పించడం ద్వారా సామాజిక న్యాయం కల్పించేందుకై ప్రకటించిన ఆరు హామీల అమలుపై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఈ క్రమంలోనే డాక్టర్ బిఆర్అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వ లోపాలను ఆరికట్టడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు, పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకొని పోయే ‘ప్రజా పాలన’ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.

తొలి సమావేశంలోనే కలెక్టర్లు, ఎస్పీలకు వార్నింగ్‌ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణలో డ్రగ్స్‌ అనే మాట వినపడొద్దన్నారు. డ్రగ్స్‌ వల్ల తెలంగాణకు పంజాబ్‌ గతే పట్టేలా ఉందని.. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేదిలేదని, ఇష్టం లేని వాళ్లు బాధ్యతల నుంచి తప్పుకోవచ్చని స్పష్టం చేశారు. అలాగే.. భూకబ్జాదారులు, నకిలీ విత్తనాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి.

డిసెంబర్ 28 నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో సభల నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం.2 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సా.5 గంటల వరకు ప్రజా పాలన సభలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు.

నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలనా యంత్రాంగాన్ని గ్రామ స్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చడం, జవాబుదారిగా ఉండేందుకై ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. డిసెంబర్ 28వ తేదీ నుండి 2024 జనవరి 6వ తేదీ వరకు సెలవు రోజులు మినహాయించి మొత్తం 8 రోజులపాటు ఈ ప్రజా పాలన గ్రామ సభలు నిర్వహిస్తారు. అన్ని గ్రామ పంచాయితీలు, మున్సిపల్ వార్డులలో రోజుకు రెండు చొప్పున అధికారులతో కూడిన బృందాలు పర్యటిస్తాయి.

ఈ ప్రజాపాలన కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులను ఆహ్వానించడం తోపాటు సంబంధిత ప్రజా ప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటారు. ఈగ్రామ సభల్లో వచ్చిన ప్రతీ దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించడానికి ఒక్కోదానికి ఒక్కొక్క ప్రత్యేకమైన నెంబర్ ఇవ్వడంతోపాటు వాటిని కంప్యూటరైజ్ చేస్తారు. సచివాలయంలో జరిగిన ఈ కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…