CM KCR: తెలంగాణలో ఇదో సువర్ణ అధ్యాయం.. జిల్లాకో వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలనే సంకల్పం- సీఎం కేసీఆర్

|

Nov 15, 2022 | 3:06 PM

వైద్యవిద్యలో కొత్త అధ్యాయనానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాకో వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్‌ సంకల్పం సాకారమయ్యే దిశగా ఓ అడుగు పడింది. ఒకే ఏడాది ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి.

CM KCR: తెలంగాణలో ఇదో సువర్ణ అధ్యాయం.. జిల్లాకో వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలనే సంకల్పం- సీఎం కేసీఆర్
CM KCR
Follow us on

మంగళవారం ప్రగతి భవన్‌లో దేశ వైద్యవిద్యా రంగంలో చారిత్రక సందర్భం చోటుచేసుకున్నది. ఒకేసారి 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. తెలంగాణ రాష్ట్రం దేశ వైద్యరంగంలోనే నూతన అధ్యాయాన్నిలిఖించింది. జిల్లాకో వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్‌ సంకల్పం సాకారమయ్యే దిశగా కీలక ముందడుగు పడింది. ఒకే ఏడాది ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. ప్రగతిభవన్‌లో నిర్వహించిన కార్యక్రమం ద్వారా నూతన వైద్య కళాశాలల్లో ఏకకాలంలో తరగతులను సీఎం కేసీఆర్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. 8 మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థుల తరగతులను ఆన్లైన్లో ప్రారంభించిన సీఎం కేసీఆర్ వైద్యరంగంలో గుణాత్మక మార్పుకు నాందిపలికారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాల‌నే ల‌క్ష్యంతో ప్రతి జిల్లాకో మెడిక‌ల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా సంగారెడ్డి, మ‌హ‌బూబాబాద్‌, మంచిర్యాల‌, జ‌గిత్యాల‌, వ‌న‌ప‌ర్తి, కొత్తగూడెం, నాగ‌ర్‌క‌ర్నూల్‌, రామగుండంలో మెడిక‌ల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కెసీఆర్ వైద్య విద్యార్థులను సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు కృషి చేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావును, ఉన్నతాధికారులను సిఎం కెసీఆర్ అభినందించారు.

వైద్యవిద్య కళాశాలలను ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణకు ఇది సువర్ణాధ్యాయమని.. మరిచిపోలేని రోజు అని అన్నారు. వైద్య విద్యార్థులు, వైద్యశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, వైద్య కళాశాలల నిర్వాహకులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. గతంలో తాగునీటికి, సాగునీటికి, మెడికల్‌ సీటుకి, ఇంజినీరింగ్‌ సీటుకు ఎన్నో రకాల అవస్థలు పడ్డాం. స్వరాష్ట్రంగా తెలంగాణ ఏర్పడటంతో ఇప్పుడు అద్భుతంగా, ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. దేశానికే మార్గదర్శకమైన అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నాం. ఈ క్రమంలో మనం 8 ప్రభుత్వ వైద్యకళాశాలలు ప్రారంభించుకోవడం చాలా గర్వకారణం. మహబూబాబాద్‌, వనపర్తిలాంటి మారుమూల ప్రాంతాల్లో వైద్యకళాశాలల వస్తాయని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు.

మరీ ముఖ్యంగా మహబూబాబాద్ వంటి గిరిజన ప్రాంతంలో, వనపర్తి వంటి మారుమూల ప్రాంతంలో ప్రభుత్వ కళాశాలలు, వైద్య కళాశాలలు వస్తాయని చెప్పి కలలో కూడా ఎవరూ ఊహించలేదు. స్వరాష్ట్ర ఏర్పాటు, ఉద్యమకారులుగా పనిచేసిన బిడ్డలే తెలంగాణ పరిపాలన సారథ్యాన్ని చేపట్టడం మన కలలను సాకారం చేసింది.

తెలంగాణ ఉద్యమకారుడు, వైద్యారోగ్యశాఖామాత్యులు హరీష్ రావు కృషితోనే ఈ 8 కళాశాలల నిర్మాణం రూపుదాల్చింది. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారికి సహకరించిన ఉన్నతాధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు. ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కళాశాల రావాలని మనం సంకల్పించుకున్నాం. ప్రభుత్వ మెడికల్ కళాశాలల సంఖ్య 17 కు పెరిగింది. 16 జిల్లాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. మరో 17 జిల్లాల్లో నూతన మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంది.

రాబోయే రోజుల్లో వీటి నిర్మాణం చేపట్టేందుకు ఇన్ ప్రిన్స్ పుల్ క్యాబినేట్ అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో మిగిలిన 17 కాలేజీల నిర్మాణం కూడా చేపట్టి, భగవంతుడి మన్సిస్తే వీటి ప్రారంభోత్సవం కూడా నేనే చేస్తానని విన్నవిస్తున్నాను.

గతంలో 850 ఎంబిబిఎస్ సీట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉండేవి. ఈ రోజు ఆ సంఖ్య 2,790 కి పెరిగింది. ఈ సంఖ్య దాదాపు 4 రెట్లు పెరిగి మన పిల్లలందరికీ సీట్లు లభించడం నాకు చాలా సంతోషం కలిగిస్తున్నది. అదే విధంగా పిజి సీట్లు, సూపర్ స్పెషాలిటీ సీట్లు మనం గణనీయంగా పెంచుకున్నాం. గతంలో 531 పిజి సీట్లు ఉంటే, ప్రస్తుతం 1,180 పిజి సీట్లు అందుబాటులోకి వచ్చాయి. గతంలో సూపర్ స్పెషాలిటీ సీట్లు 70 మాత్రమే ఉంటే, ఈ రోజు 152 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

దీంతో విద్యార్థులకు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. రత్నాల్లాంటి, వజ్రల్లాంటి విద్యార్థులకు ఇది మంచి అవకాశం. దళిత, గిరిజన, బడుగు బలహీన, బిసి, మైనార్టీ విద్యార్థులకు ఇదొక మంచి అవకాశం. జనాభా నిష్పత్తికి అనుగుణంగా డాక్టర్లు అందుబాటులో ఉండడం ఎంత అవసరమో, పారా మెడికల్ సిబ్బంది సిబ్బంది ఉండడం అంతే అవసరం. అదే వైద్య రంగ పటిష్టతను సూచిస్తుంది. ఈ సంఖ్యను పెంపొందించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ దిశగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది.  అన్ని ప్రాంతాల్లో సమతూకంగా ఉండేట్లు వీటి ఏర్పాటు జరుగుతున్నది. ములుగు, భూపాలపల్లి జిల్లాలు ఒకే నియోజకవర్గంలో ఉన్నా, వీటి సమగ్రాభివృద్ధి జరగాలనీ రెండు ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలను మంజూరు చేశాం. కరోనా వంటి పాండమిక్ భయోత్పాతాన్ని మనం చూశాం. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వైద్యరంగాన్ని పటిష్టం చేస్తున్నాం.

ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా గొప్ప రక్షణ కవచంగా ఉండాలని వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని వేల కోట్ల రూపాయలు వెచ్చించి మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నది. అన్ని రంగాల్లో తెలంగాణ ఆచరిస్తుంది… దేశం అనుసరిస్తుంది. వైద్యరంగంలో కూడా తెలంగాణను దేశం అనుకరించే విధంగా యువ రాష్ట్రమైన తెలంగాణ ఎదగడం నాకు చాలా సంతోషంగా ఉంది.

పేదల ప్రజల సంక్షేమమే ద్యేయంగా వైద్యరంగానికి చెందిన విద్యార్థులు, అధ్యాపకులు ముందుకు సాగాలి. పేదల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ బాధ్యత కాబట్టీ ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం వెనుకాడదు. రాష్ట్ర వ్యాప్తంగా పారామెడికల్ కాలేజీలు త్వరలోనే ప్రారంభించుకునేలా వైద్యారోగ్య శాఖామాత్యులు హరీష్ రావు చర్యలు చేపడతారు.

అమెరికాలోనూ వైద్య సదుపాయాలు సరిపోక చనిపోయారు. వైద్య వ్యవస్థ పటిష్ఠంగా ఉన్నచోట నష్టం తక్కువగా ఉంటుంది. కొవిడ్‌ లాంటి మహమ్మారులు, ఇతర వైరస్‌ల బెడద రాకూడదు. వైద్య విద్యార్థులతో రాష్ట్రానికి వైద్య కవచం నిర్మించుకుంటున్నాం’’ అని కేసీఆర్ అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం