
హైదరాబాద్, జులై 12: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు, కోడి గుడ్ల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ధరలు అమాంతం ఆకాశానికి ఎగబాకాయి. మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉండటం, అందుకు తగిన విధంగా సరఫరా లేకపోవడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. కిలో చికెన్ ధర ఏకంగా రూ.340కి చేరింది. ఇక ఒక్కో కోడిగుడ్డు ధర రూ.8 దాటింది. ఈ రోజు ఆదివారం కావడంతో చికెన్ షాపులు వెలవెల బోతున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యులకు ఆదివారం చికెన్ ముక్క కొనలేని స్థితి దాపురించింది.
రెండు వారాల క్రితం కిలో చికెన్ రేటు రూ. 250 ఉంటే అది ఏకంగా రూ.110 పెరిగి రూ. 340కి చేరింది. మాంసాహార ప్రియులకు ఇది షాకింగ్ పరిణామమే. హోటళ్లు, గృహ అవసరాలకు చికెన్ కొనుగోలు చేసేవారు ధరలు చూసి లబోదిబోమంటున్నారు. వానాకాలం వచ్చిన చుట్టం చూపుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో ఎండ తీవ్రత కారణంగా కోళ్లు, గుడ్ల ఉత్పత్తి భారీగా పడిపోయింది. మరోవైపు కోళ్ల ఫారంలలో దాణా ఖర్చులు పెరగడమే ఈ పరిస్థితులకు ప్రధాన కారమని వ్యాపారులు అంటున్నారు. మరో నెలన్నర వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ధరలు ఇలానే ఉంటే పూర్తిగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెరిగిన ముడి సరుకులు, చికెన్, గుడ్ల ధరలతో హోటళ్లు, మెస్లలో భోజనం రేట్లు సైతం పెరుగుతున్నాయి. దీంతో బిర్యానీ, చికెన్ కర్రీ ఆర్డర్లు సగానికి తగ్గిపోయాయని హోటల్ యజమానులు చెబుతున్నారు.
కోడిగుడ్ల ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. వారం క్రితం ఒక్కో గుడ్డు రూ.6 నుంచి రూ.7కి లభించగా.. ప్రస్తుతం ఒక్కో కోడిగుడ్డు ఏకంగా రూ.8.50కు చేరింది. ఫలితంగా రిటైల్ మార్కెట్లో డజను గుడ్ల ధర రూ.90కు చేరింది. చికెన్ రేట్లు పెరిగినప్పుడు కోడి గుడ్డుతో సరిపెట్టుకునే మధ్యతరగతి కామన్ పీపుల్ పప్పు, పచ్చళ్లతో సర్దుకుపోతున్నారు. అటు కూరగాయల ధరలు సైతం షాకిస్తున్నాయి. ఇక మధ్యతరగలి వాళ్లు ఏం తిని బతకాలి అనే పరిస్థితికి చేరుకున్నారు.