
Telangana elections: తెలంగాణలో పార్టీలు మారడం, కండువాలు కప్పుకోవడం మరింత జోరందుకుంది. టికెట్ దక్కని నేతలు, అసంతృప్తంగా ఉన్న కొందరు నాయకులు పార్టీలు మారుతున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ జంప్జిలాలనీల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ గులాబీకి తెరలేపింది. దాంతో ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు పెరిగాయి. శుక్రవారం బీఆర్ఎస్లో పార్టీలో రావుల చంద్రశేఖర్రెడ్డి, జిట్ట బాలకృష్ణరెడ్డి, ఇతర నేతలు చేరారు. తాజాగా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన చెరుకు సుధాకర్ కూడా.. గులాబీ కండువా కప్పుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, జగదీశ్రెడ్డి సమక్షంలో సీనియర్ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ బీఆర్ఎస్లో చేరారు. సుధాకర్తో పాటు నకిరేకల్, ఆలేరు నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలకు మంత్రి కేటీఆర్.. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కరుడుగట్టిన తెలంగాణ ఉద్యమవాది చెరుకు సుధాకర్ అని కొనియాడారు మంత్రి హరీష్రావు. ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయిన వ్యక్తి ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారని విమర్శించారు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ఘనత ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిదన్నారు. రేవంత్ సీట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారన్నారు. కేసీఆర్కు పనితనమే తప్ప.. పగలేదంటూ మంత్రులు కేటీఆర్, హరీష్రావు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే లేరంటూ కేటీఆర్, హరీష్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ.. రాంగ్ గాంధీ అని పేరు మార్చుకోవాలన్నారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చిన నేత కేసీఆర్ అంటూ పేర్కొన్నారు. కర్నాటకలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని.. కాంగ్రెస్ పార్టీకి విషయం లేదు.. అన్నీ కాపీలేనంటూ విమర్శించారు. మళ్లీ కేసీఆర్ గెలవాలి.. మరింత అభివృద్ధి జరగాలని కోరారు. నల్లగొండజిల్లాలో 12 స్థానాలు మొత్తం క్లీన్స్వీప్ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణలో మళ్లీ కేసీఆర్ గెలిచి హ్యాట్రిక్ కొడతారని మంత్రులు కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ వస్తే కరువు, కర్ఫ్యూ వస్తాయని, బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..