Municipal Election: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. కోతులు, కుక్కల బెడద నివారణతోపాటు కీలక హామీలు!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. పురపోరులో కమలనాథులు కదనరంగంలోకి దూకారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిచేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. ఢిల్లీ నేతలను మోహరించి.. గల్లీల్లో జెండా పాతేందుకు వ్యూహాన్ని రచిస్తున్నారు. 60 శాతానికి పైగా మున్సిపాలిటీలు తమవే అంటోంది కమలం పార్టీ.

Municipal Election: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. కోతులు, కుక్కల బెడద నివారణతోపాటు కీలక హామీలు!
Municipal Election Bjp Manifesto

Updated on: Feb 06, 2026 | 5:06 PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. పురపోరులో కమలనాథులు కదనరంగంలోకి దూకారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిచేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. ఢిల్లీ నేతలను మోహరించి.. గల్లీల్లో జెండా పాతేందుకు వ్యూహాన్ని రచిస్తున్నారు. 60 శాతానికి పైగా మున్సిపాలిటీలు తమవే అంటోంది కమలం పార్టీ. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను అధికారికంగా విడుదల చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలను రాజకీయంగా కీలకంగా భావిస్తున్న భారతీయ జనతా పార్టీ, ఈ ఎన్నికల ద్వారా ప్రజల్లో తన బలాన్ని చాటాలని వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో తనదైన ముద్ర వేసేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్, మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్‌తో పాటు కో-ఇన్ ఛార్జులు అశోక్ పర్నామి, రేఖాశర్మ ఇప్పటికే రాష్ట్రంలో మకాం వేశారు. క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు అన్నీ తానై చూస్తున్నారు షెలార్. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన షెలార్.. రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా.. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీజేపీ అస్త్రాలను సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందంటూ ఇప్పటికే ఛార్జ్ షీట్ విడుదల చేసింది. కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులతోనే పట్టణాల్లో అభివృద్ధి సాధ్యమవుతోందని, రాష్ట్ర ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టిస్తోందని కమలనాథులు అంటున్నారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు కీలక హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రధాన అంశాల్లో కోతులు, కుక్కల బెడద నివారణను చేర్చారు.

మేనిఫెస్టో ప్రధాన హామీలు:

పన్నుల పెంపు లేదు, వారం రోజుల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు, బస్తీ దవాఖానలు, స్మార్ట్ సిటీలుగా అభివృద్ది, క్లీన్ సిటీ, గ్రీన్ టౌన్.

100 శాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ , దేవాలయాల రక్షణ, మహిళల రక్షణ.

మున్సిపాలిటీల్లో దోమలు, పందులు, కుక్కలు, కోతుల బెడద నివారణ.

సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి కోసం బీజేపీ మేనిఫెస్టో అంటూ రూపకల్పన

తొలిసారి తెలంగాణలో అన్ని మున్సిపల్ వార్డుల్లో పోటీ చేస్తున్న బీజేపీ.. మెజారీటీ స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని పార్టీ పట్టుదలతో ఉంది. 60 శాతానికి పైగా మున్సిపాలిటీలు, కనీసం 5 కార్పొరేషన్లను దక్కించుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కష్టపడుతున్నారు. బీజేపీ యువ మోర్చాకు ఈ ఎన్నికల్లో ప్రత్యేక టాస్క్ ఇచ్చారు. జెన్-జీ టార్గెట్‌గా ప్రచారంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..