దళిత బంధు మా వాళ్లకే.. బీజేపీకి చెందిన ఎస్సీలకు కాదంటూ సంచలన కామెంట్ చేసిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. నిర్మల్జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నేతలు , కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేసి…ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లాజెండాలు పట్టుకొని బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. దళితులకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కి తరలించారు.
మొన్న నిర్మల్జిల్లా సోన్, లక్ష్మణచందా మండలాల్లో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేం దళితులమే కదా మాకు దళితబంధు ఇవ్వాలని కొందరు మహిళలు మంత్రిని కలిశారు. దళితబంధు మా వాళ్లకే ఇస్తామని, మీరు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాలని వ్యాఖ్యనించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఈ వ్యాఖ్యలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఖండించారు. తాను దళితులను కించపరిచే విధంగా మాట్లాడలేదన్నారు. దళితబంధుకు బీజేపీ నయా పైసా ఇవ్వలేదని మాత్రమే తానూ చెప్పానన్నారు. తన మాటను కొన్ని పత్రికలు వక్రీకరించాయన్నారు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం