Nizamabad Municipal Election Result: మేయర్‌ పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ.. మరోసారి 2020 రిపీట్ అవుతుందా?

అక్కడే ఆగిపోయిన కమలం పార్టీ.. మళ్లీ అలాగే జరుగుతుందా ? అధికారానికి దాదాపుగా దగ్గరికి వచ్చినట్టే వచ్చి ఆగిపోయిన భారతీయ జనతా పార్టీ.. ఈసారి ఏం చేయబోతోంది. కరీంనగర్‌తో పాటు నిజామాబాద్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని భావించిన బీజేపీ ఆశలు నెరవేరే అవకాశాలు ఉన్నాయా? కాషాయ పార్టీకి మరో కార్పొరేషన్ దక్కకుండా కాంగ్రెస్ ఏం చేయబోతోంది ?

Nizamabad Municipal Election Result: మేయర్‌ పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ.. మరోసారి 2020 రిపీట్ అవుతుందా?
Nizamabad Municipal Corporation

Updated on: Feb 14, 2026 | 7:35 AM

అక్కడే ఆగిపోయిన కమలం పార్టీ.. మళ్లీ అలాగే జరుగుతుందా ? అధికారానికి దాదాపుగా దగ్గరికి వచ్చినట్టే వచ్చి ఆగిపోయిన భారతీయ జనతా పార్టీ.. ఈసారి ఏం చేయబోతోంది. కరీంనగర్‌తో పాటు నిజామాబాద్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని భావించిన బీజేపీ ఆశలు నెరవేరే అవకాశాలు ఉన్నాయా? కాషాయ పార్టీకి మరో కార్పొరేషన్ దక్కకుండా కాంగ్రెస్ ఏం చేయబోతోంది ? ఈసారి నిజామాబాద్‌ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు.. మరోసారి 2020 నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన బీజేపీ.. కార్పొరేషన్లలో మాత్రం ప్రభావం చూపించింది. సొంతంగానే కరీంనగర్ కార్పొరేషన్‌ను సొంతం చేసుకున్న కమలం పార్టీ.. నిజామాబాద్‌లోనూ సింగిల్‌గా మేయర్ పీఠం సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసింది. ఫలితాల సరళి కూడా అదే రకంగా కనిపించినా.. చివరకు గతంలో మాదిరిగానే 28 సీట్ల దగ్గర ఆగిపోయింది బీజేపీ. మ్యాజిక్‌ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచిపోయింది.

నిజామాబాద్ కార్పొరేషన్‌లో 28 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. 18 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. ఇక 13 సీట్లు గెలుచుకున్న ఎంఐఎం మరోసారి నిజామాబాద్‌లో తన పట్టు నిలుపుకుంది. బీఆర్ఎస్ ఒక్క స్థానంలో విజయం సాధించింది. నిజామాబాద్ కార్పొరేషన్‌లో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తమకు ఉన్న 5 ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలన్నది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్, ఎంఐఎం కలిస్తే కార్పొరేషన్‌లో మెజార్టీ వచ్చినట్టే అనే చెప్పాలి. మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్సీలు కూడా ఇక్కడ ఓటు వేసే అవకాశం ఉండటంతో నిజామాబాద్ మేయర్ స్థానం అధికార కాంగ్రెస్ దక్కించుకుంటుందా ? అనే చర్చ జరుగుతోంది.

అయితే ఇక్కడ గత కార్పొరేషన్ ఎన్నికల్లోనూ దాదాపు ఇదే రకమైన ఫలితాలు రావడంతో మేయర్ స్థానాన్ని నాటి అధికార పార్టీ బీఆర్ఎస్ దక్కించుకుంది. గతంలో ఇక్కడ 60 డివిజన్లకు గానూ బీఆర్ఎస్​13 చోట్ల మాత్రమే గెలిచింది. అయితే 16 మంది మజ్లిస్, ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్, ఐదుగురు ఎక్స్​ అఫీషియో మెంబర్ల బలంతో మేయర్ స్థానాన్ని నాడు బీఆర్ఎస్ దక్కించుకుంది. గతంలో బీజేపీ సొంతంగా 28 చోట్లా గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా మేయర్​ పదవిని దక్కించుకోలేకపోయింది. దీంతో నిజామాబాద్‌లో మరోసారి 2020 రిపీట్ అవుతుందా ? లేక బీజేపీ ఏదో రకంగా మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంటుందా ? అన్న ఆసక్తి నెలకొంది.

 మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..