హమ్మయ్యా.. తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు.. రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు..!

Weather Forecast Telugu States: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల రాక ఖరారు కావడం సామాన్యులతో పాటు రైతుల్లోనూ కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. అయితే తొలికరి జల్లులతో పాటు వీచే బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుల పట్ల ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

హమ్మయ్యా.. తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు.. రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు..!
Ap, Telangana Weather Report

Updated on: Jun 08, 2026 | 7:41 AM

Weather Forecast Telugu States: ఓవైపు ఎండలు, మరోవైపు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తూ ముంగిట్లోకి వచ్చేశాయి. పశ్చిమ-మధ్య, ఈశాన్య బంగాళాఖాతం అంతటా ఇవి పూర్తిగా ప్రవేశించడంతో, రాబోయే రెండు మూడు రోజుల్లోనే రెండు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.

శరవేగంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు..

దేశవ్యాప్తంగా వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అనుకూల పరిస్థితుల వల్ల నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్, మిజోరాంలను పూర్తిగా చుట్టేసిన రుతుపవనాలు.. త్రిపుర, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ విస్తరణకు మరింత బలాన్ని ఇస్తోంది.

తెలంగాణలో ద్రోణి ప్రభావం.. ఈదురు గాలులతో కూడిన వర్షాలు..

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాబోయే 48 నుంచి 72 గంటల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని పలు జిల్లాల్లోకి ప్రవేశించడానికి పూర్తి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక బలమైన ద్రోణి కొనసాగుతోంది.

దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అయితే వర్షాలు పడినా, గరిష్ట ఉష్ణోగ్రతల్లో రానున్న మూడు రోజులు పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని స్పష్టం చేశారు.

ఏపీ, యానాంలో అల్పపీడన ద్రోణి అలజడి..

మరోవైపు అమరావతి వాతావరణ కేంద్రం ఆంధ్రప్రదేశ్, యానాం ప్రజలకు కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం కోస్తా కర్ణాటక పరిసర ప్రాంతాల నుండి కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.6 కిలోమీటర్ల ఎత్తులో ఒక అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాగల మూడు రోజులు వాతావరణం విభిన్నంగా మారనుంది.

సోమ, మంగళవారాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. అదే సమయంలో అక్కడక్కడా తీవ్రమైన వడగాలులు వీచే ప్రమాదం కూడా పొంచి ఉంది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.

రాయలసీమకు భారీ వర్ష సూచన.. కోస్తాలో ఉక్కపోత..

రాయలసీమ ప్రాంతంలో వాతావరణం మరింత వేగంగా మారుతోంది. ఈరోజు రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బలమైన గాలుల కారణంగా చేతికి వచ్చిన పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులను హెచ్చరించారు.

ఇక దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు పడినా, వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల వేడి, ఉక్కపోత విపరీతంగా ఉంటాయని పేర్కొన్నారు. ఉక్కపోత కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. రాబోయే ఐదు రోజుల్లో ఎండల తీవ్రత కొద్దిగా తగ్గినప్పటికీ, ఉష్ణోగ్రతలు మాత్రం స్థిరంగానే కొనసాగుతాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.

Follow Us