
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అశ్వాపురం మండలం బిజీ కొత్తూరులో పొలం చదును చేసే పనిలో భాగంగా ఓరైతు జేసిబితో తవ్వకాలు జరుపుతుండగా ఒక పురాతన మట్టి కుండ బయటపడింది. ఆ కుండలో సుమారు 70 పురాతన నాణేలు ఉండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. పొలం పనులు చేస్తున్న సమయంలో కుండ బయటపడగానే అక్కడ ఉన్న ట్రాక్టర్ డ్రైవర్లు నాణేలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది. అయితే నాణేల పంపకాల విషయంలో వారి మధ్య తలెత్తిన వివాదం కారణంగా పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది.
ఇది చదవండి: ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎన్ని రోజుల వరకు పూజలు చేయకూడదంటే.?
ఇదే క్రమంలో ఓ వ్యక్తి దగ్గర ఉన్న రెండు నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పోలీసుల విచారణలో ఈ నాణేలు రాగితో తయారు చేయబడినట్లుగా గుర్తించారు. ఈ నాణేలు 14వ శతాబ్దానికి చెందిన బహుమనీ సుల్తానుల కాలానికి చెందినవిగా నిర్ధారించారు. పురాతన చరిత్రకు సంబంధించిన ఈ విలువైన నాణేలు బయటపడటం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు ఈ నాణేలను సంబంధిత పురావస్తు శాఖకు అప్పగించే ప్రక్రియలో ఉన్నారు. గతంలో కూడా బిజీ కొత్తూరు ప్రాంతంలో కొందరికి బంగారు నాణేలు దొరికినట్లుగా చెప్తున్నారు స్థానికులు. సంబంధిత పురావస్తు శాఖ ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని తవ్వకాలు జరిపితే మరింత సమాచారం బయటపడే అవకాశం ఉంటుందంటున్నారు చరిత్రకారులు.
ఇది చదవండి: ఇలా చేస్తే దోసెలు పెనానికి జన్మలో కూడా అతుక్కోవు.. ఎలాగో మీరూ చూడండి