Video: ప్రణయ్‌ హత్య కేసులో తీర్పు! రంగనాథ్‌కు అమృత్‌ ఫోన్‌ కాల్‌.. భావోద్వేగానికి గురవుతూ..

2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ కోర్టు తీర్పును వెల్లడించింది. ప్రధాన నిందితుడు A2కు మరణశిక్ష, మిగిలిన ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పుతో ప్రణయ్ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. అప్పటి ఎస్పీ రంగనాథ్ వృత్తి నిజాయితీని కొనియాడారు. ఈ క్రమంలో అమృత, రంగనాథ్ కు ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Video: ప్రణయ్‌ హత్య కేసులో తీర్పు! రంగనాథ్‌కు అమృత్‌ ఫోన్‌ కాల్‌.. భావోద్వేగానికి గురవుతూ..
Amrutha Ranganath

Updated on: Mar 10, 2025 | 6:19 PM

2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో ఈ రోజు నల్గొండ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏ2కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో తుది తీర్పు రావడంతో మరోసారి ఈ కేసు విషయమై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. నేరస్థులకు శిక్ష పడటంతో ప్రణయ్‌ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రణయ్‌ భార్య అమృత్‌ హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు ఫోన్‌ చేశారు. ప్రణయ్‌ హత్య జరిగిన సమయంలో రంగనాత్‌ నల్గొండ ఎస్పీగా ఉన్నారు. ఆ కేసును ఆయన డీల్‌ చేశారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, కేసు విషయంలో పలు రకాల కన్ప్యూజన్స్‌ క్రియేట్‌ అయినా ఎక్కడా కూడా ఆయన వెనకడుగు వేయలేదు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలనే పట్టుదలతో ఎంతో నిజాయితీ వ్యవహరించారు. దీంతో తన భర్త మరణానికి న్యాయం చేసినందుకు అమృత, రంగానాథ్‌కు ధన్యవాదలు తెలిపేందుకు ఫోన్‌ చేశారు.

ఈ సందర్భంగా అమృత కాస్త భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయమై రంగనాథ్‌ మాట్లాడుతూ.. ఈ కేసులో అన్ని కోణాలు ఉన్నాయని, ఇది ఒక పరువు హత్య అని, కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య చేయించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరస్థులు చాలా తెలివిగా వ్యవహరించారని రంగనాథ్ తెలిపారు. కేసు మొదట్లో చాలా గందరగోళంగా ఉందని, మారుతీరావు కూడా తనకు ఏమీ తెలియదని చెప్పాడని ఆయన అన్నారు. దర్యాప్తు ప్రారంభించిన మూడు రోజుల్లోనే కేసును ఛేదించామని తెలిపారు. ఈ కేసులో ఏ2 నిందితుడికి మరణశిక్ష, ఏ3తో పాటు మిగిలిన వారికి జీవిత ఖైదు పడటం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. నిజం ఎప్పుడూ నిజమేనని, ఎంత దాచినా అది బయటకు వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఇక ఈ కేసులో తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రణయ్ తల్లిదండ్రులు.. ప్రణయ్ సమాధి వద్ద నివాళులర్పించి, కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ కేసు విచారణలో సహకరించిన డీఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. వంద మంది సాక్షులు, 1600 పేజీల ఛార్జ్ షీట్ తో అప్పటి ఎస్పీ రంగనాథ్ నిందితులకు శిక్ష పడేలా నిక్కచ్చిగా వ్యవహరించారని కొనియాడారు. ఇక ఈ కేసులో మరణశిక్ష పడిన A2 నిందితుడు సుభాష్ శర్మను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. A3 నిందితుడు అస్గర్ అలీని గుజరాత్ సబర్మతి జైలుకు, మిగిలిన ఐదుగురు నిందితులను నల్లగొండ జైలుకు తరలించారు.