
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ తీవ్ర అలజడి రేపింది. లేడీస్ హాస్టల్లో ర్యాగింగ్కు పాల్పడడం చర్చనీయాశంగా మారింది. జూనియర్ విద్యార్థులపై అమ్మాయిలు ర్యాగింగ్ చేయడం కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా ర్యాగింగ్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ర్యాగింగ్కు పాల్పడుతున్నారన్న కారణంతో ఏకంగా 81 మంది విద్యార్థినులపై సస్పెనషన్ వేటు వేశారు. ఇలా ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులను సస్పెండ్ చేయడం వర్సిటీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
పరిచయాల పేరుతో పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినులు జూనియర్లపై ర్యాంగింగ్కు పాల్పడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పద్మావతి మహిళా వసతి గృహంలో ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థినుల వివరాలు సేకరించిన అనంతరం విద్యార్థినులను సస్పెండ్ చేశారు. సస్పెన్సన్ కు గురయిన వారిలో పీజీ 28 , కామర్స్ 28, ఎకనామిక్స్ 25 మంది, జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థినులు ఉన్నారు. విద్యార్థినులను వారం రోజులు పాటు సస్పెండ్ చేశారు.
ఇదిలా ఉంటే మిగతా విభాగాల్లోనూ ర్యాగింగ్కు పాల్పడిన వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు వర్సిటీ అధికారులు. ఆధారాలు లభిస్తే ర్యాగింగ్ చేస్తున్న వారిని సస్పెండ్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇక శనివారం నుంచి డిసెంబర్ 31 వరకు క్రిస్మస్ సెలవులు ప్రకటించిన అధికారులు, విద్యార్థులు వెంటనే హాస్టల్స్ను ఖాళీ చేయాలని తెలిపారు. ర్యాగింగ్ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..