Telangana: ఘోరం.. వనపర్తి గురుకులంలో ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య! ఏం జరిగిందో?

తెలంగాణలోని వనపర్తిలో ఉన్న గురుకుల విద్యాలయంలో ఘోర ఘటన వెలుగు చూసింది. ఏడో తరగతి చదువుతున్న బాలుడు అనుమానాస్పద స్థితిలో వసతి గృహంలో ఫ్యాన్ కు విగత జీవిగా వేలాడుతూ కనిపించాడు..

Telangana: ఘోరం.. వనపర్తి గురుకులంలో ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య! ఏం జరిగిందో?
7th Standard Student

Updated on: Nov 28, 2024 | 9:43 AM

వనపర్తి, నవంబర్‌ 28: తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల్లో విద్యావిధానం ప్రశ్నార్ధకంగా మారింది. ఓ వైపు గురుకులాల్లో కలుషిత భోజనాలతో విద్యార్ధులు వరుసగా మృత్యువాత పడుతుంటే.. మరోవైపు మరికొందరు విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తు్న్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాల్లో వివిధ కారణాలతో 48 మంది విద్యార్థులు మృతి చెందారు. ఈ క్రమంలో వనపర్తి జిల్లా మదనాపురం ఎస్సీ బాలుర గురుకులంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి పట్టపగలే.. వసతి గృహంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై స్థానకులు భగ్గుమంటున్నారు. అసలేం జరిగిందంటే..

వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరుకు చెందిన శ్రీనివాసులు, సత్యమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె సంతానం. కూలి పనులు చేసుకునే శ్రీనివాసులు, సత్యమ్మ దంపతులు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివిస్తున్నారు. జోవనోపాధి కోసం తల్లిదండ్రులు హైదరాబాద్‌కి వచ్చి గతకొంతకాలంగా అక్కడే నివసిస్తున్నారు. వీరి రెండో కొడుకైన ప్రవీణ్‌ (13) గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో బాలుడు ప్రవీణ్‌ గురుకుల పాఠశాలలో మంగళవారం సాయంత్రం కబడ్డీ ఆడుతుండగా గాయాలయ్యాయి. గాయాలైన ప్రవీణ్‌కు గురుకులంలో ఉండే హెల్త్‌ టేకర్‌ టాబ్లెట్లు అందించి, ప్రధమ చికిత్స చేశాడు.

బాలుడు గాయపడిన విషయాన్ని ఉపాధ్యాయుడు ఫోన్‌లో ప్రవీణ్‌ తల్లిదండ్రులకు తెలియజేసినట్లు చెబుతున్నాడు. ఆ మరుసటి రోజు అంటే బుధవారం ఉదయం టిఫిన్‌ చేసిన అనంతరం విద్యార్ధులందరూ ప్రార్థనకు వెళ్లారు. ఆ సమయంలో తనకు తలనొప్పి వస్తున్నదని టీచర్‌కు చెబితే.. టాబ్లెట్‌ వేసుకొని విశ్రాంతి తీసుకొమని ప్రవీణ్‌ను వసతి గృహానికి పంపించారు. అయితే వసతి గృహానికి వెళ్లిన ప్రవీణ్‌ అక్కడి ఫ్యాన్‌కు దుప్పటితో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అప్పటికే ప్రవీణ్‌ తండ్రి ఆప్పత్రికి తీసుకెళ్దామని గురుకుల పాఠశాలకు వెళ్లాడు. విద్యార్థి డార్మెటరీలో ఉన్నాడని చెప్పడంతో అక్కడకు వెళ్లి చూడగా ప్రవీణ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే మదనాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి వనపర్తికి జిల్లా దవాఖానకు తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే బాలుడు మృతి చెందినట్టు ధ్రువీకరించారు. వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలికి చేరుకొని ఆరా తీశారు. అనారోగ్యంగా ఉన్న విద్యార్థులను వెల్‌నెస్ సెంటర్​లో పెట్టి పర్యవేక్షించాల్సిన సిబ్బంది విద్యార్థిని ఒంటరిగా డార్మెటరీలో విడిచిపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us