
మేడిపల్లి, ఫిబ్రవరి 18: ఆదివారం కోడి కూర వండలేదన్న కోపంతో ఓ పతి దేవుడు భార్యపై చిందులేశాడు. అంతటితో ఆగకుండా నేరుగా ఇంట్లోకి వెళ్లి ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తెలంగాణలోని మేడిపల్లిలో జరిగింది. వివరాల్లోకెళ్తే..
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప్సింగారంలోని న్యూవెంచర్లో దాసరాజుల పద్మ (65), దాసరాజుల ప్రకాష్ (66) దంపతులు కాపురం ఉంటున్నారు. వీరికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. ప్రకాశ్ విశ్రాంత ఉద్యోగి. ఫిబ్రవరి 15న శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రకాశ్ చికెన్ కూర వండాలని భార్య పద్మను కోరాడు. అయితే ఈ రోజు పండగ కావడంతో ఇంట్లో మాంసం వండేందుకు భార్య నిరాకరించింది. ఈ విషయమై దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది.
గొడవ అనంతరం పద్మ బస్టాండ్ వైపు వెళ్లి కొంత సమయం తరువాత తిరిగి ఇంటికి వచ్చింది. ఇంటి తలుపులు తీయగానే ఆమె భర్త ప్రకాష్ సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే పద్మ ఇరుగు పొరుగు సహాయంతో అపస్మారక స్థితిలో ఉన్న భర్తను గాంధీ ఆసుపత్రికి తరలించింది. అదే రోజు సాయంత్రం 7 గంటల సమయంలో పద్మ పెద్దల్లుడు అంచ మహేష్ (39)కు ఫోన్ చేసిన భర్తతో చికెన్ వండకం విషయంలో గొడవ జరిగిందని, క్షణికావేశంలో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే ప్రకాశ్ అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటనపై అల్లుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.