
ట్రాఫిక్ ఫైన్ ఉందన్న ఒక్క మెసేజ్ ఓ వ్యక్తి జీవితాన్ని కుదిపేసింది. రూ.500 చలానా చెల్లించాలనే ఉద్దేశంతో ఓ లింక్పై క్లిక్ చేసిన అతడికి కొన్ని నిమిషాల్లోనే రూ.6 లక్షలు మాయం అయ్యాయి. హైదరాబాద్లో తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన సైబర్ నేరగాళ్ల కొత్త పంథాకు అద్దం పడుతుంది. మంగళవారం బాధితుడి మొబైల్కు ట్రాఫిక్ ఈ-చలాన్ ఉందంటూ ఓ మెసేజ్ వచ్చింది. అందులో ఉన్న లింక్ను తెరిచితే.. అది అచ్చం అధికారిక ట్రాఫిక్ చలాన్ వెబ్సైట్లా కనిపించింది. అనుమానం రాకపోవడంతో అతడు ఫైన్ చెల్లించే ప్రయత్నం చేశాడు.
రూ.500 చలానా చెల్లించేందుకు క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేయగానే అసలు కథ మొదలైంది. వెంటనే సైబర్ కేటుగాళ్లు అంతర్జాతీయ లావాదేవీల ద్వారా అతడి కార్డు నుంచి సుమారు ఆరు లక్షల రూపాయలు డ్రా చేశారు. విషయం తెలుసుకునేలోపే ఖాతా ఖాళీ అయిపోయింది. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందిస్తూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫేక్ ట్రాఫిక్ ఈ-చలాన్ లింక్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. మెసేజ్లు, వాట్సాప్ లింక్ల ద్వారా వచ్చే చలానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఫైన్లు చెల్లించాలంటే http://echallan.parivahan.gov.in, లేదా రాష్ట్ర ట్రాఫిక్ పోలీసుల అధికారిక వెబ్సైట్ను మాత్రమే ఉపయోగించాలన్నారు. మెసేజ్ల్లో వచ్చే లింక్లపై క్లిక్ చేయకూడదని.. కార్డు వివరాలు తెలియని సైట్లలో నమోదు చేయకూడదని సూచించారు. సైబర్ నేరానికి గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. ఆలస్యం చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశం తగ్గిపోతుందని పోలీసులు చెబుతున్నారు.