
నిద్రలేచి ఇంటి నుంచి బయటకు వెళ్తున్న వ్యక్తి కాలికి ఏదో మెత్తగా తగలడంతో మొదట ఏమిటో అర్థం కాలేదు. లైట్ వేసి చూడగానే ఇంట్లో భారీ కొండచిలువ కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని ఎస్సీ, బీసీ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కాలనీలో నివాసం ఉంటున్న బండి వెంకన్న తెల్లవారుజామున మూత్ర విసర్జన కోసం నిద్రలేచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కాలికి మెత్తగా ఏదో తగలడంతో అనుమానం వచ్చి వెంటనే లైట్ వేశారు. అక్కడ దాదాపు 10 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ కనిపించడంతో షాక్కు గురయ్యారు. వెంటనే పెద్దగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు.
సమాచారం అందుకున్న స్థానిక యువకులు అక్కడికి చేరుకుని ధైర్యంగా కొండచిలువను కొట్టి చంపేశారు. ఇంట్లోకి ఇంత పెద్ద పాము రావడంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చిన్నారులు, వృద్ధులు ఉన్న కుటుంబాలు మరింత అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పొదలు, పొలాలు, కాలువలు వంటి ప్రాంతాల నుంచి పాములు జనావాసాల్లోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి