US vs China: అంతరిక్షానికి పాకిన అమెరికా-చైనా ప్రచ్ఛన్న యుద్ధం.. తారాస్థాయికి చేరిన ఆధిపత్య పోరు

|

Jun 21, 2021 | 8:14 PM

China Vs Nasa: అంతరీక్ష పరిశోధనా కార్యక్రమాల్లో అమెరికాను సవాలు చేస్తోంది చైనా. ఇప్పటివరకు భూమిపై అన్ని రంగాల్లో అమెరికాకు ధీటుగా, పోటీగా డ్రాగన్ దేశం ఉద్యమిస్తోంది. ఐటీ, సాంకేతిక, ఆర్థిక, మేధో పరిజ్ఞానంలో అమెరికాకు చెక్ పెడుతోంది.

US vs China: అంతరిక్షానికి పాకిన అమెరికా-చైనా ప్రచ్ఛన్న యుద్ధం.. తారాస్థాయికి చేరిన ఆధిపత్య పోరు
China Mars Rover
Follow us on

China Vs Nasa: అంతరీక్ష పరిశోధనా కార్యక్రమాల్లో అమెరికా(NASA)ను సవాలు చేస్తోంది చైనా. ఇప్పటివరకు భూమిపై అన్ని రంగాల్లో అమెరికాకు ధీటుగా, పోటీగా డ్రాగన్ దేశం ఉద్యమిస్తోంది. ఐటీ, సాంకేతిక, ఆర్థిక, మేధో పరిజ్ఞానంలో అమెరికాకు చెక్ పెడుతోంది. వాణిజ్య పరంగా తన ఉత్పత్తులతో ప్రపంచ దేశాల మార్కెట్లలో చైనా కీలక భూమిక పోషిస్తోంది. మరోవైపు తమ సాంకేతిక పరిజ్ఞానంను చైనా కాపీ కొడుతోందని అమెరికా ఆరోపిస్తోంది. ఇటీవల కొవిడ్-19 మహమ్మారి కారణంగా అమెరికా- చైనాల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. అన్ని రంగాల్లో అగ్రదేశం అమెరికాతో చైనా ఢీ అంటే ఢీ అంటోంది. రెండు దేశాల మధ్య రాజకీయ వైరుధ్యాలతో ఇరు దేశాల మధ్య పోటీ శృతిమించిపోతోంది.

అమెరికాలో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్య పాలన ఉండగా చైనాలో కమ్యూనిస్టుల పాలన నడుస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఆధిపత్య పోటీ.. ఆకాశమే హద్దుగా కొనసాగుతోంది. జాతీయ రక్షణ, డిజిటల్ సమాచార వ్యవస్థ- ఉపగ్రహాల వరకు రెండు దేశాల మధ్య పోటీ నెలకొంటోంది. 1991 వరకు అమెరికా- సోవియట్ యూనియన్ ప్రపంచానికి రెండు ధ్రువాలుగా ఉన్న పరిస్థితి. అయితే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడంతో..గత రెండు దశాబ్ధాలుగా అమెరికా- చైనా మధ్య ప్రచ్ఛన యుద్ధం నడుస్తోంది. అంతరిక్షంలో సోవియట్ యూనియన్ ఆధిక్యత అంతరించిపోవడంతో..అమెరికా ఆధిక్యత కొనసాగుతోంది. గగనవీధుల్లోనూ అమెరికాకు ధీటుగా చైనా స్పేస్ కార్యక్రమాలు  చేపడుతోంది. ఇటీవల అంతరిక్షంలో పరిశోధనలు, కార్యక్రమాలతో చైనా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఆధిక్యతను చైనా సవాలు చేసే పరిస్థితులు వచ్చాయని అగ్ర దేశంలోని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Space Research

అంతరిక్షంలో చైనా ప్రగతి…
2003లో అంతరిక్షంలోకి తొలి వ్యోమగామిని చైనా కక్ష్యలోకి పంపింది. అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపిన దేశాల్లో సోవియట్ యూనియన్, అమెరికా తర్వాత మూడో స్థానంలో చైనా నిలిచింది. చైనా తొలి ప్రొటో టైప్ అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్-1 నెలకొల్పింది. ఇది భూమి చుట్టు 29, సెప్టెంబర్ 2011 నుంచి 2 ఏప్రిల్ 2018 వరకు పరిభ్రమించింది.
రెండో ప్రొటో టైప్ స్పేస్ స్టేషన్ టియాంగాంగ్-2 భూమి చుట్టు  15 సెప్టెంబర్ 2016 నుంచి 19 జులై 2019 వరకు పరిభ్రమించింది. తాజాగా 10 ఏళ్లు సేవలందించే విధంగా మల్టీ మాడ్యూల్ ‘టియాంగాంగ్’ స్టేషన్ ప్రయోగం చేపట్టింది.
టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి 11 మాడ్యుల్లను చైనా ప్రయోగించనుంది. ఈ ఏడాది ఏప్రిల్లో తొలి మాడ్యూల్ టియాన్హే ప్రయోగం చేపట్టింది. భూమికి 340 – 450 కిలోమీటర్ల ఎత్తులో  టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం పరిభ్రమించింది.
2022 నాటికి  టియాంగాంగ్ నిర్మాణం పూర్తికానుంది.

2019లో సిబ్బంది లేకుండా చంద్ర మండలానికి రోవర్ ను పంపిన తొలి దేశంగా నిలిచింది చైనా. అమెరికా జీపీఎస్ కు పోటీగా గత ఏడాదిలో నావిగేషన్ ఉపగ్రహం బిడౌ వ్యవస్థ(బీడీఎస్-3)ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. అమెరికా తర్వాత మార్స్ పైకి రోవర్ ను పంపిన రెండో దేశం చైనానే. ఏప్రిల్ 2021లో మార్స్(అంగారక గ్రహం) మీదకు చైనా రోవర్ పంపింది. చైనా చేపట్టిన ఈ ప్రయోగంతో అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యంకు సవాల్ మొదలైందని నాసా పాలనాధికారి బిల్ నీల్సన్ పేర్కొన్నారు. ఒక సదస్సులో నీల్సన్ మాట్లాడుతూ..అంతరీక్షంలో అమెరికాకు చైనా ఏకైక పోటీ దేశంగా మారిందని వ్యాఖ్యానించారు. చంద్రునిపైకి మనుషులను తీసుకుపోయే ప్రాజెక్టుకు అమెరికన్ పార్లమెంట్ కాంగ్రెస్ నిధులు మంజూరు చేయాలని నీల్సన్ కోరారు.

గత వారంలో అమెరికా-చైనా మధ్య అంతరిక్ష పోరు మరింత తీవ్రరూపం దాల్చింది. నిర్మాణంలో ఉన్న చైనా స్పేస్ స్టేషన్ లోకి ఆ దేశానికి చెందిన ముగ్గురు వ్యోమగాములు చేరుకున్నారు. మూడు నెలలపాటుఅక్కడే ఉండి స్పేస్ స్టేషన్ నిర్మాణంలో వ్యోమగాములు పాలుపంచుకోనున్నారు. ఇప్పటివరకు అంతరిక్షంలో ఐఎస్ఎస్(అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం) ఉండగా.. తాజాగా చైనా టియాంగాంగ్ కేంద్రం రానున్న నేపథ్యంలో అంతరిక్ష కార్యక్రమాల్లో ఇరుదేశాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంటోంది. 1998లో ఏర్పాటైన ఐఎస్ఎస్ నిర్మాణంలో అమెరికా, రష్యా, యూరోప్, జపాన్, కెనడా దేశాలు పాలుపంచుకున్నాయి. 23 ఏళ్లలో 19 దేశాలకు చెందిన 200కు పైగా వ్యోమగాములు ఐఎస్ఎస్ సందర్శించారు. అయితే వీరిలో చైనా వ్యోమగాములు ఎవరూ లేరు.

Nasa Vs China

2011 నుంచి చైనా, నాసా(అమెరికా మధ్య) విభేదాలు..
2011లో గూఢచారం వ్యవహారంలో కాంగ్రెస్ ది వుల్ఫ్ అమెండ్ మెంట్ (సవరణ) ఆమోదించిన తర్వాత అంతరీక్ష పరిశోధనల్లో చైనాకిచ్చే సహకారాన్ని అమెరికా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించాలని చైనా నిర్ణయం తీసుకుంది. ఈ వ్యూహంలో భాగంగానే టియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌ను ఆ దేశం నిర్మిస్తోంది. మరోవైపు ఐఎస్ఎస్‌ను 2024లో విరమించాలని భావిస్తున్న నాసా భావిస్తోంది. ఐఎస్ఎస్ జీవిత కాలం పొడిగించాలన్నదానిపై ప్రాజెక్టులో పాలుపంచుకున్న దేశాలనుంచి ఇప్పటివరకు స్పందన లేకపోవడంతో అమెరికా ఒత్తిడిలో ఉంది.
ఐఎస్ఎస్ విరమణ జరిగితే అంతరిక్షంలో మిగిలే ఒకే ఒక అంతరిక్ష కేంద్రం చైనా టియాంగాంగ్ మాత్రమే అవుతుంది. ఇది అగ్రరాజ్యం అమెరికాకు మింగుడు పడని పరిణామం.

అమెరికా- చైనా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం
చైనా చేపడుతున్న అంతరిక్ష కార్యక్రమాలతో అమెరికా-చైనా మధ్య  ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం నెలకొంటోంది. గతంలో అమెరికా-సోవియట్ యూనియన్(రష్యా) మధ్య ఏర్పడిన ప్రచ్ఛన యుద్ధం వాతావరణాన్ని ప్రస్తుతం అమెరికా-చైనా మధ్య నెలకొన్న విరోధం తలపిస్తోంది. మరోవైపు విదేశీ వ్యోమగాములకు తమ టియాంగాంగ్ కేంద్రంలో పాలుపంచుకోవాలని చైనా ఆహ్వానిస్తోంది. అటు చంద్రుడి దక్షిణ ధ్రువంపై 2035 నాటికి రష్యాతో కలిసి సంయుక్త పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని చైనా భావిస్తోంది. ఇటు చంద్రుడిపై పరిశోధన, బాధ్యతాయుతమైన ప్రయోగాలు చేపట్టేందుకు అమెరికా నేతృత్వంలో అంతర్జాతీయ సంకీర్ణం ఏర్పాటైయ్యింది. 2020 మే నెలలో విడుదల చేసిన అర్టిమిస్ ఒప్పందంగా పిలుస్తున్న ఈ పత్రంపై  12 దేశాలు ( అమెరికా, ఆస్ట్రేలియా, కెనాడా, జపాన్, లక్సెంబర్గ్, ఇటలీ, యూకే, యూఏఈ, ఉక్రెయిన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, బ్రెజిల్) సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంపై సంతకం చేయని దేశాల్లో చైనా, రష్యాలు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య అంతరీక్ష పోటీ ఏ స్థాయికి వెళుతుందో వేచిచూడాల్సిందే.

Also Read..

బిలియనీర్ జెఫ్ బెజోస్ అంతరిక్షంలోనే ఉండాలట……భూమికి తిరిగి రావద్దంటున్న నెటిజన్లు …ఇదెక్కడి వింత ..?

 వారణాసి, హౌరా మధ్య బుల్లెట్ ట్రైన్..! 680 కిలోమీటర్ల ప్రయాణం కేవలం మూడు, నాలుగు గంటల్లోనే..