తమిళనాడు కోర్టు సంచలన తీర్పు.. లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయుడికి 49 ఏళ్ల జైలు శిక్ష
బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న నేరంపై ఓ ఉపాధ్యాయుడికి 49 ఏళ్ల జైలుశిక్ష విధించింది తమిళనాడుకు చెందిన కోర్టు.
teacher imprisonment for 49 years : విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి కఠినశిక్ష విధించింది న్యాయస్థానం. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న నేరంపై ఓ ఉపాధ్యాయుడికి 49 ఏళ్ల జైలుశిక్ష విధించింది తమిళనాడుకు చెందిన కోర్టు. పుదుకోట జిల్లా గంధర్వకోట సమీపంలోని తువార్ గ్రామానికి చెందిన అన్బరసన్ (52) నరియన్పుదుపట్టి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో జ్ఞానశేఖరన్ (50) ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
అయితే, అదే పాఠశాలలో చదువుతున్న ఆరుగురు విద్యార్థినులపై 2018లో ఉపాధ్యాయులు అన్బరసన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయుడికి తెలిపినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని పుదుకోట మహిళా పోలీస్స్టేషన్లో విద్యార్థినుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు.. అన్బరసన్, జ్ఞానశేఖరన్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి వారిని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన పుదుకోట మహిళా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
ఉపాధ్యాయుడు అన్బరసన్కు మూడు సెక్షన్లకింద మొత్తం 49 ఏళ్ల జైలుశిక్ష, ప్రధానోపాధ్యాయుడు జ్ఞానశేఖరన్కు ఏడాది జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు న్యాయమూర్తి సత్య. అలాగే, బాధిత విద్యార్థినులకు ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల చొప్పున రాష్ట్రప్రభుత్వం పరిహారం అందజేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో ఏసీబీ సోదాల కలకలం.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎండీ భాస్కరాచారి..!