
తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 టోర్నీకి సంబంధించి ఈ రోజు వేలం జరుగుతోంది. ఈ వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్, మన హైదరాబాదీ కుర్రాడు మొహమ్మద్ సిరాజ్ భారీ ధర పలికాడు. కనీస ధర రూ.5 లక్షలతో ప్రారంభమైన సిరాజ్ వేలం.. రూ.14లక్షలకు వెళ్లింది. వరంగల్ వారియర్స్ టీమ్ సిరాజ్ను సొంతం చేసుకుంది. అలాగే మరో హైదరాబాదీ, టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ సైతం కళ్లు చెదిరిపోయే ధర దక్కించుకున్నాడు. తిలక్ను మెదక్ ఫాల్కన్స్ టీమ్ రూ.33లక్షలకు సొంత చేసుకుంది. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా జరుగుతోంది. జూన్ 21 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా లీగ్పై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
మొత్తం 8 ఫ్రాంచైజీ జట్లు పాల్గొనే ఈ టోర్నీ 21 రోజుల పాటు సాగనుండగా, ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా 32 మ్యాచ్లు నిర్వహించనున్నారు. హెచ్సీఏలో నమోదైన 1,300 మందికి పైగా ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొంటున్నారు. ప్రతి ఫ్రాంచైజీకి రూ.60 లక్షల పర్స్ మనీ కేటాయించగా, కనీసం రూ.54 లక్షలు ఖర్చు చేయడం తప్పనిసరి చేశారు. ఒక్కో జట్టు గరిష్టంగా 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఐకాన్, A+, A, B, C1, C2 కేటగిరీలుగా ఆటగాళ్లను విభజించి పారదర్శకంగా వేలం నిర్వహిస్తున్నారు. TG20 లీగ్ ప్రత్యేకత గ్రామీణ ప్రతిభకు పెద్దపీట వేయడంలో ఉంది. ప్రతి జట్టులో కనీసం నలుగురు జిల్లా ఆటగాళ్లు ఉండాలని, అలాగే ప్లేయింగ్ ఎలెవన్లో ఇద్దరు జిల్లా క్రికెటర్లు తప్పనిసరిగా ఆడాలని నిబంధన విధించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి