
Saina Nehwal – Parupalli Kashyap: 2018లో వివాహం చేసుకున్న సైనా నెహ్వాల్ పారుపల్లి కాశ్యప్ జంట గతేడాది జులై 13న విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ తర్వాత కొద్ది కాలానికే వారు తిరిగి ఒక్కటయ్యారు. ఈ విషయంపై సైనా మాట్లాడుతూ ఏ బంధమైనా సరళ రేఖలా సాగదని అందులో ఒడిదొడుకులు సహజమని పేర్కొన్నారు. ఇద్దరు బలమైన వ్యక్తిత్వాలు ఉన్న వ్యక్తులు కలిసినప్పుడు భేదాభిప్రాయాలు రావడం సాధారణమని కానీ వాటిని ఎలా పరిష్కరించుకుంటామనేదే ముఖ్యమని ఆమె అన్నారు.
తమ ప్రయాణంలో కమ్యూనికేషన్, ఓపిక చాలా ముఖ్యమని తాము గ్రహించినట్లు సైనా తెలిపారు. కొన్నిసార్లు ఒక అడుగు వెనక్కి వేసి అవతలి వ్యక్తి కోణంలో ఆలోచించడం వల్ల బంధం బలపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. బంధం అనేది ఒక భాగస్వామ్యం మాత్రమే తప్ప గొడవల్లో గెలవడం కాదని ఆమె స్పష్టం చేశారు. పరస్పర గౌరవం నమ్మకం ఉన్నచోట ఇగోకు తావు ఉండకూడదని ఆమె సూచించారు.
మహిళలపై మాతృత్వం విషయంలో ఉండే సామాజిక ఒత్తిడి గురించి కూడా సైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. తల్లి కావడం అనేది పూర్తిగా ఒక మహిళ వ్యక్తిగత నిర్ణయమని దీనిపై సమాజం కాలపరిమితులు విధించకూడదని ఆమె అన్నారు. నేటి కాలంలో మహిళలు కెరీర్ ఆశయాలు, వ్యక్తిగత ఎంపికల మధ్య సమతుల్యత పాటిస్తున్నారని వారి నిర్ణయాలను గౌరవించాలని సైనా కోరారు. సమాజం కోసం కాకుండా తాను మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే ఆ నిర్ణయం తీసుకోవాలని ఆమె హితవు పలికారు.
లింగ వివక్షపై స్పందిస్తూ క్రీడలు, నాయకత్వ పాత్రల్లో ఇప్పటికీ మహిళలకు సమాన అవకాశాలు గుర్తింపు లభించడం లేదని సైనా ఆవేదన వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే పరిస్థితులు మెరుగుపడినప్పటికీ ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందన్నారు. బాలికలకు సమానమైన ప్రోత్సాహం మౌలిక సదుపాయాలు, సమాజం నుంచి నమ్మకం లభిస్తే వారు ఏ రంగంలోనైనా అద్భుతాలు సృష్టిస్తారని సైనా నెహ్వాల్ విశ్వాసం వ్యక్తం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..