
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళిగా శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత క్రికెటర్లు ఆర్మీ క్యాప్లు ధరించి ఆటను ఆడిన విషయం తెలిసిందే. టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ ధోని.. మ్యాచ్కు ముందు తన సహచరులకు బీసీసీఐ లోగోలతో ఉన్న ఆర్మీ క్యాప్లను అందించాడు. ఆట ముగిసే వరకు ఆ టోపీలను వారు తీయలేదు. అంతేకాదు మూడో వన్డేలో తమకు దక్కిన మ్యాచ్ ఫీజును కూడా జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు కోహ్లీ సేన ప్రకటించింది. అయితే ఈ క్యాప్లను పెట్టుకొని టీమిండియా తప్పు చేసిందంటూ కొంతమంది తమ అభిప్రాయాలను చెబుతున్నారు.
జవాన్లకు నివాళిగా విరాళాలు ఇవ్వాలనుకుంటోన్న వారు తమ భక్తిని ఇలా చూపించుకోవాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు. అంతేకాకుండా ఇలా పెట్టుకోవడం వలన యుద్ధ వాతావరణానికి పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లు అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఇప్పటివరకు చాలా విపత్తులు, దాడులు జరిగాయని, అప్పుడు ఎంతోమంది క్రికెటర్లు వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చి జాతీయతను నిరూపించుకున్నారని, కానీ ఇలా చేయడం దేశానికి కూడా మంచిది కాదని చెబుతున్నారు.
క్రీడలు, జాతీయతకు మధ్య చాలా సాన్నిహిత్యం ఉంటుంది. అందుకే ఆయా దేశాల జాతీయ పతకాలకు అనుగుణంగా జెర్సీలను రూపొందిస్తుంటారు. అలాగే పోటీలలో గెలిచిన వారు తమ దేశ పతకాలను చుట్టుకొని ఆనందపడుతుంటారు. అయితే ఇలాంటి చర్యల వలన దేశ ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు. 1936 బెర్లిన్ ఒలింపిక్స్లో హిట్లర్కు సెల్యూట్ చేసేందుకు ఒప్పుకోని దేశాలలో భారత్ ఒకటని, కానీ అక్కడకు వెళ్లిన భారత ఆటగాళ్లు తమ జాతీయతను వేరే విధంగా చూపించుకున్నారని పలువురు చెబుతున్నారు. ఇప్పుడు టీమిండియా ఆర్మీ క్యాప్లను ధరించడం రాజకీయంగా కూడా పలు దుష్పరిణామాలకు దారి తీస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇలా కాకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున జరిగిన ఈ ఆటను వారికి మద్దతు ఇచ్చే విధంగా ఏదైనా చిహ్నాన్ని ధరించే ఉంటే జట్టుకు ఆదర్శంగా ఉండేదని పలువురు చెబుతున్నారు. ఈ చర్యకు భవిష్యత్లోనైనా భారీ మూల్యాన్ని టీమిండియా చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ ఓ సీనియర్ జర్నలిస్ట్ తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు.