
Yesha Sagar vs Sameer Rizvi Controversy: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక యువ క్రికెటర్ మరియు మహిళా యాంకర్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, అందులో ఆ క్రికెటర్ ఆమెను తీవ్రంగా నియంత్రిస్తున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. జర్నలిస్ట్ అభిషేక్ త్రిపాఠి చేసిన కొన్ని పరోక్ష వ్యాఖ్యలు ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. అధికారికంగా పేర్లు వెల్లడించనప్పటికీ, నెటిజన్లు మాత్రం ఆ జంట సమీర్ రిజ్వీ, యెషా సాగర్ అని ఒక నిర్ణయానికి వచ్చేశారు.
సమీర్ రిజ్వీ తనపై మత మార్పిడి కోసం ఒత్తిడి చేస్తున్నాడని, క్రీడా వ్యాఖ్యాతగా పని చేస్తున్న సమయంలో ఇతర క్రికెటర్లతో షేక్ హ్యాండ్ చేయకుండా కేవలం నమస్కారం మాత్రమే చేయాలని షరతులు విధించాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, ఆమె సామాజిక మాధ్యమ ఖాతాల నుంచి కొన్ని రకాల ఫొటోలను తొలగించాలని కూడా ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇవి అత్యంత సున్నితమైన అంశాలు కావడంతో ఈ వివాదం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.
ఈ వివాదం మరింత ముదురుతుండటంతో యెషా సాగర్ తన సోషల్ మీడియా వేదికగా ఒక రహస్య సందేశాన్ని పంచుకున్నారు. “సోషల్ మీడియాలో మీరు చూసే లేదా చదివే ప్రతిదానిని నమ్మకండి” అని ఆమె పేర్కొన్నారు. దీని ద్వారా సమీర్ రిజ్వీతో తనపై వస్తున్న ఆరోపణలను ఆమె పరోక్షంగా ఖండించారు. అయితే, సమీర్ రిజ్వీ ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరు పక్షాలు ప్రస్తుతం ఈ సున్నితమైన అంశంపై మౌనాన్ని పాటిస్తున్నాయి.
యెషా సాగర్ ప్రముఖ క్రీడా వ్యాఖ్యాత, మోడల్. పంజాబ్లోని లూథియానాలో జన్మించిన ఆమె, ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లారు. తొలుత పంజాబీ మ్యూజిక్ వీడియోల ద్వారా గుర్తింపు పొందిన ఆమె, తర్వాత క్రీడా రంగంపై ఆసక్తితో వ్యాఖ్యాతగా మారారు. గ్లోబల్ టీ20 కెనడా, యూపీ టీ20 లీగ్, మహిళా ప్రీమియర్ లీగ్ వంటి వేదికలపై ఆమె పనిచేశారు. నివేదికల ప్రకారం, యూపీ టీ20 లీగ్ సమయంలో సమీర్ రిజ్వీతో ఆమెకు పరిచయం ఏర్పడింది.
ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్లో సమీర్ రిజ్వీ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటివరకు ఆడిన 7 ఇన్నింగ్స్ల్లో 149.28 స్ట్రైక్ రేట్తో 209 పరుగులు చేశారు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడినప్పటికీ, ఈ ఏడాది ఢిల్లీ జట్టులో ఆయన కీలక ఆటగాడిగా మారారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..