
Yashasvi Jaiswal: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో అసితా ఫెర్నాండోతో జరిగిన మైదానపు గొడవపై భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎట్టకేలకు నోరు విప్పారు. తన ప్రవర్తనను తప్పుబడుతూ ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే చేసిన కామెంట్లకు సోషల్ మీడియా వేదికగా జైస్వాల్ గట్టి కౌంటర్ ఇచ్చారు. శ్రీలంక బౌలర్ హద్దులు దాటి ప్రవర్తించాడని, భారత్ ఎప్పటికీ తగ్గి ఉండే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కొలంబో టెస్టు తొలిరోజే జైస్వాల్ అవుట్ అయిన సమయంలో అసితా ఫెర్నాండో సెండ్ ఆఫ్ ఇచ్చే క్రమంలో ఏదో అనడంతో వివాదం మొదలైంది. తీవ్ర ఆగ్రహానికి గురైన జైస్వాల్ వెనక్కి తిరిగి వచ్చి ఫెర్నాండో వద్దకు వెళ్లారు. ఈ సమయంలో జైస్వాల్ హెల్మెట్ ఫెర్నాండో నుదుటికి తాకడంతో తీవ్ర కలకలం రేగింది. దీనిపై హర్షా భోగ్లే స్పందిస్తూ.. బౌలర్లు రెచ్చగొట్టినా జైస్వాల్ ప్రశాంతంగా వెళ్ళిపోవాల్సిందని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలని సలహా ఇచ్చారు.
హర్షా భోగ్లేకి జైస్వాల్ ఘాటు కౌంటర్
హర్షా భోగ్లే వ్యాఖ్యలు ఉన్న వీడియోపై జైస్వాల్ నేరుగా స్పందించారు. “శ్రీలంక బౌలర్ నాతో ఏమన్నాడో మీకు తెలియకుండా మీరే ఒక నిర్ణయానికి రాకండి. ఎదుటి వ్యక్తి గీత దాటి ప్రవర్తించినప్పుడు భారత్ ఊరుకోదు, సరిగ్గా తిరిగి సమాధానం చెప్తుంది” అని జైస్వాల్ ఘాటుగా కామెంట్ చేశారు. జైస్వాల్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
తగ్గేదే లేదంటున్న భారత ఓపెనర్
జైస్వాల్ వ్యాఖ్యలను బట్టి చూస్తే మైదానంలో శత్రువుల మైండ్ గేమ్ను తట్టుకుని ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టమవుతోంది. ప్రత్యర్థి బౌలర్లు ఎంత రెచ్చగొట్టినా భయపడకుండా కౌంటర్ ఇస్తామనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు. భారత క్రికెటర్ల ఆత్మవిశ్వాసానికి ఇది నిదర్శనమని అభిమానులు మద్దతు తెలుపుతున్నారు.
ఐసీసీ చర్యలు తప్పవా?
జైస్వాల్ తన చర్యను సమర్థించుకున్నప్పటికీ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారం మైదానంలో ఫిజికల్ కాంటాక్ట్ నిషిద్ధం. మ్యాచ్ రెఫరీ ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తే జైస్వాల్ మ్యాచ్ ఫీజులో కోత పడే అవకాశం ఉంది. అంతేకాకుండా డిమెరిట్ పాయింట్లు పడే ప్రమాదం కూడా పొంచి ఉంది. యశస్వి జైస్వాల్ ఇచ్చిన గట్టి కౌంటర్ భారత డ్రెస్సింగ్ రూమ్ వైఖరిని స్పష్టం చేస్తోంది. అయితే ఐసీసీ మ్యాచ్ రెఫరీ ఇచ్చే తుది నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..