WTC Final : WTC ఫైనల్ రేసులో టీమిండియా..మిగిలిన 10 టెస్టుల్లో ఎన్ని గెలవాలో తెలుసా ?

సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత జట్టుకు పెద్ద షాక్. ఈ ఓటమి కారణంగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 పాయింట్ల పట్టికలో టీమిండియా నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ సైకిల్‌లో భారత్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 4 గెలిచి, 3 ఓడి, ఒకటి డ్రా చేసుకుంది.

WTC Final : WTC ఫైనల్ రేసులో టీమిండియా..మిగిలిన 10 టెస్టుల్లో ఎన్ని గెలవాలో తెలుసా ?
Indian Team

Updated on: Nov 17, 2025 | 5:19 PM

WTC Final : సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత జట్టుకు పెద్ద షాక్. ఈ ఓటమి కారణంగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 పాయింట్ల పట్టికలో టీమిండియా నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ సైకిల్‌లో భారత్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 4 గెలిచి, 3 ఓడి, ఒకటి డ్రా చేసుకుంది. అయితే, అభిమానులకు శుభవార్త ఏమిటంటే.. భారత్‌కు ఇంకా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కాబట్టి ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఇంకా బలంగానే ఉంది.

ప్రస్తుతం భారత్ 8 టెస్టుల్లో 4 విజయాలతో 52 పాయింట్లు సాధించి, 54.17% PCT (పాయింట్స్ పర్సెంటేజ్) వద్ద ఉంది. WTC ఫైనల్‌కు చేరాలంటే గత రికార్డుల ప్రకారం.. కనీసం 64% నుంచి 68% PCT అవసరం అవుతుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మిగిలిన 10 మ్యాచ్‌లలో కనీసం 7 మ్యాచ్‌లు గెలవడం తప్పనిసరి. 7 విజయాలు సాధిస్తే 62.96% PCT వస్తుంది. ఒకవేళ 7 విజయాలతో పాటు ఒక మ్యాచ్ డ్రా అయినా, పాయింట్స్ పర్సెంటేజ్ 64.81%కి చేరుకుంటుంది. ఒకవేళ 8 మ్యాచ్‌లు గెలిస్తే, పాయింట్స్ పర్సెంటేజ్ 68.52% అవుతుంది. ఇది ఫైనల్‌లో స్థానాన్ని పక్కా చేస్తుంది.

భారత్ మిగిలిన 10 మ్యాచ్‌ల షెడ్యూల్ చాలా కీలకం, సవాలుతో కూడుకున్నది. ఇందులో సౌతాఫ్రికాతో ఆఖరి టెస్ట్, స్పిన్ పిచ్‌లపై శ్రీలంకతో రెండు టెస్టులు, కఠినమైన వాతావరణంలో న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరగబోయే ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌పైనే ఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.

ఫైనల్‌కు చేరుకోవడానికి, భారత్ మిగిలిన సౌతాఫ్రికా మ్యాచ్ గెలిచి, శ్రీలంకను 2-0తో క్లీన్ స్వీప్ చేసి, న్యూజిలాండ్‌తో 1-1 డ్రా చేసుకుని, ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కనీసం 3 మ్యాచ్‌లు గెలవడం వంటి లక్ష్యాలను పెట్టుకోవాలి. ఈ విధంగా 7 లేదా 8 విజయాలను సాధించవచ్చు. ఒకవేళ ఎక్కువ డ్రాలు లేదా ఊహించని ఓటములు సంభవిస్తే మాత్రం, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆశలు తగ్గుతాయి. కాబట్టి టీమిండియా ప్రతి మ్యాచ్‌ను గెలవాలనే లక్ష్యంతో ఆడటం తప్పనిసరి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..