
WPL 2026 : మహిళా ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు పెను షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్, ఆర్సీబీ ఛాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఎల్లీస్ పెర్రీ ఈ ఏడాది టోర్నీ నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను ఆడలేకపోతున్నానని ఆమె బోర్డుకు సమాచారం అందించారు. పెర్రీ లేకపోవడం ఆర్సీబీకే కాకుండా డబ్ల్యూపీఎల్ అభిమానులందరికీ పెద్ద నిరాశ కలిగించే విషయమే.
ఆర్సీబీ జట్టును 2024లో విజేతగా నిలబెట్టడంలో ఎల్లీస్ పెర్రీ పాత్ర మరువలేనిది. ఈ సీజన్ కోసం ఆర్సీబీ ఆమెను రూ.2 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే అనూహ్యంగా ఆమె తప్పుకోవడంతో జట్టు సమీకరణాలు మారిపోయాయి. డబ్ల్యూపీఎల్ చరిత్రలో పెర్రీకి తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆడిన 25 మ్యాచ్ల్లో ఆమె 64.8 సగటుతో 972 పరుగులు చేసింది. ఇందులో 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్తోనే కాకుండా బౌలింగ్లోనూ 14 వికెట్లు తీసి జట్టుకు వెన్నెముకగా నిలిచింది. ఇటీవల జరిగిన ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్లో కూడా ఆమె ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో అదిరిపోయే ఫామ్లో ఉండటం గమనార్హం.
ఎల్లీస్ పెర్రీ స్థానాన్ని భర్తీ చేయడం అసాధ్యమే అయినప్పటికీ, ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆమె స్థానంలో భారత ఆల్ రౌండర్ సయాలీ సత్ఘరేను జట్టులోకి తీసుకుంది. 25 ఏళ్ల సయాలీ గతంలో భారత్ తరపున 3 వన్డేలు ఆడింది. గతంలో ఈమె గుజరాత్ జెయింట్స్ తరపున 4 మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. ఈ ఏడాది వేలంలో ఎవరూ కొనుగోలు చేయని సయాలీకి, పెర్రీ తప్పుకోవడంతో ఇప్పుడు రూ. 30 లక్షల బేస్ ప్రైస్తో ఆర్సీబీలో ఆడే అవకాశం దక్కింది.
కేవలం ఆర్సీబీ మాత్రమే కాదు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కూడా పెద్ద దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ అనాబెల్ సదర్లాండ్ కూడా వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ నుంచి తప్పుకున్నారు. ఆమె స్థానంలో ఢిల్లీ జట్టు ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ అలనా కింగ్ను రూ.60 లక్షల ఒప్పందంతో సైన్ చేసుకుంది. యూపీ వారియర్స్ జట్టులో కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. కీలకమైన విదేశీ ఆటగాళ్లు దూరమవ్వడంతో ఈసారి డబ్ల్యూపీఎల్ 2026 మరింత ఆసక్తికరంగా మారనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..