
భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించిన ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ నాలుగేళ్ల విజయవంతమైన పదవీకాలాన్ని ముగించారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు, బీసీసీఐ అధికారులు ఆయన సేవలను ప్రశంసిస్తున్నారు. ఫీల్డింగ్ను మ్యాచ్ ఫలితాన్ని మార్చే ఆయుధంగా తీర్చిదిద్దడంలో టీ దిలీప్ చేసిన కృషి విశేషమని చాలా మంది అంటున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ సైతం యూ క్రియేటెడ్ మ్యాజిక్ అంటూ స్పందించడం విశేషం. చాలా మంది యువ క్రికెటర్లు సైతం ఆయన టీమిండియా నుంచి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేక కన్నీళ్లతో వీడ్కోలు పలికినట్లు సమాచారం. రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్గా బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడు జట్టు మొత్తం ఎలా బాధ పడిందో ఇప్పుడు దిలీప్ వెళ్లిపోతున్నా.. అలానే బాధ పడుతున్నారని తెలుస్తోంది. అయితే అసలు టీ దిలీప్ టీమిండియా కోసం చేశారు? ఎందుకు ఒక ఫీల్డింగ్ కోచ్ దూరం అవుతుంటే అంతలా ఫీల్ అవుతున్నారు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
హైదరాబాద్కు చెందిన తంగిరాల దిలీప్ దేశీయ క్రికెట్లో కోచ్గా మంచి గుర్తింపు సంపాదించారు. హైదరాబాద్ క్రికెట్ వ్యవస్థలో పనిచేసిన ఆయన, తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో కోచ్గా సేవలందించారు. యువ ఆటగాళ్లలో ఫిట్నెస్, ఫీల్డింగ్ నైపుణ్యాలను పెంపొందించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ 2022లో ఆయనను భారత జట్టు ఫీల్డింగ్ కోచ్గా నియమించింది.
టీ దిలీప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టులో ఫీల్డింగ్కు కొత్త ప్రాధాన్యం లభించింది. ప్రతి మ్యాచ్ తర్వాత అత్యుత్తమ ఫీల్డర్ను గుర్తిస్తూ బెస్ట్ ఫీల్డర్ మెడల్ సంప్రదాయాన్ని ప్రారంభించారు. డ్రెస్సింగ్రూమ్లో ఈ అవార్డును వినూత్నంగా అందించే విధానం ఆటగాళ్లలో పోటీ తత్వాన్ని పెంచింది. దీంతో ప్రతి ఆటగాడు క్యాచ్లు, డైవింగ్ సేవ్లు, వేగవంతమైన త్రోలు, గ్రౌండ్ ఫీల్డింగ్పై మరింత దృష్టి పెట్టడం ప్రారంభించాడు.
టీ దిలీప్ హయాంలో భారత జట్టు ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డింగ్ జట్లలో ఒకటిగా ఎదిగింది. కీలక మ్యాచ్ల్లో క్యాచ్లు వదిలే సందర్భాలు తగ్గాయి. బౌండరీల వద్ద అద్భుతమైన సేవ్లు, నేరుగా వికెట్లను లక్ష్యంగా చేసుకున్న త్రోలు, రన్ఔట్లు పెరగడం వంటి మార్పులు స్పష్టంగా కనిపించాయి. ఫిట్నెస్కు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఆటగాళ్ల చురుకుదనం కూడా పెరిగింది. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శుభ్మన్ గిల్, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు ఫీల్డింగ్లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచారు.
టీ దిలీప్ సేవల కాలంలో భారత జట్టు అనేక కీలక సిరీస్ విజయాలు సాధించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ వంటి ప్రధాన టోర్నీల్లో భారత జట్టు ఫీల్డింగ్కు ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా ఒత్తిడి పరిస్థితుల్లో కూడా ఆటగాళ్లు అసాధారణ ఫీల్డింగ్ ప్రదర్శించడం వెనుక టీ దిలీప్ శిక్షణ కీలక పాత్ర పోషించిందని పలువురు మాజీ క్రికెటర్లు పేర్కొన్నారు.
టీ దిలీప్ ఆటగాళ్లతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. శిక్షణను ఆసక్తికరంగా మార్చడం, ప్రతి ఆటగాడి బలాబలాలను విశ్లేషించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం ఆయన ప్రత్యేకత. అందుకే భారత జట్టులోని యువ ఆటగాళ్ల నుంచి సీనియర్ల వరకు అందరూ ఆయనను ఎంతో గౌరవంగా చూసేవారు.
నాలుగేళ్ల కాలంలో టీ దిలీప్ భారత క్రికెట్ జట్టులో ఫీల్డింగ్కు కొత్త ప్రమాణాలను తీసుకొచ్చారు. ఫీల్డింగ్ను కేవలం సహాయక విభాగంగా కాకుండా మ్యాచ్ను గెలిపించే ప్రధాన ఆయుధంగా మార్చారు. ఆయన రూపొందించిన శిక్షణ విధానాలు, ఫిట్నెస్ ప్రమాణాలు, పోటీ స్ఫూర్తిని పెంచే కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా భారత జట్టుకు ఉపయోగపడే అవకాశముంది. భారత క్రికెట్లో ఫీల్డింగ్ సంస్కృతిని మరింత బలోపేతం చేసిన కోచ్గా టీ దిలీప్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి