
VVS Laxman Vs Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆల్ రౌండర్ల సిద్ధాంతం యూకే పర్యటనలో ఘోరంగా దెబ్బతింది. కానీ, జింబాబ్వే పర్యటనలో తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ స్పెషలిస్ట్ ఆటగాళ్లతో దిగి తొలి మ్యాచ్లోనే ఘన విజయం సాధించారు. క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ ఇద్దరి కోచింగ్ శైలిపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
గౌతమ్ గంభీర్ భారత జట్టు బాధ్యతలు స్వీకరించిన తర్వాత జట్టులో వీలైనంత ఎక్కువ మంది ఆల్ రౌండర్లు ఉండాలని బలంగా భావించారు. మ్యాచ్లో వైవిధ్యం తెచ్చేందుకు, బ్యాటింగ్ డెప్త్ పెంచేందుకు ప్రతీ ఫార్మాట్లోనూ ఆల్ రౌండర్లను అధికంగా చేర్చుకున్నారు. అయితే, ఈ ప్రక్రియలో స్పెషలిస్ట్ బ్యాటర్లు, బౌలర్లను పక్కనబెట్టి అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ పూర్తిగా చేయలేని ‘బిట్స్ అండ్ పీసెస్’ ఆటగాళ్లపై ఎక్కువ ఆధారపడ్డారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టీ20 ప్రపంచకప్ విజయంలో ఈ ఆల్ రౌండర్ల వ్యూహం సఫలమైనప్పటికీ, అప్పుడు హార్దిక్ పాండ్యా రూపంలో ఒక పరిపూర్ణమైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ అందుబాటులో ఉన్నాడు. 2024 ప్రపంచకప్లో 144 రన్స్ చేసి 11 వికెట్లు తీసిన హార్దిక్, 2026 మెగా టోర్నీలోనూ 217 రన్స్ సాధించి 9 వికెట్లతో మెరిశాడు. హార్దిక్ తో పాటు అక్షర్ పటేల్, శివమ్ దూబేలు చక్కటి మద్దతు అందించడంతో ఆ ప్రయోగం వర్కవుట్ అయింది. కానీ ప్రతికూల పరిస్థితుల్లో ఈ ప్రయోగమే జట్టును దెబ్బతీసింది.
హార్దిక్ పాండ్యా సేవలు అందుబాటులో లేకపోవడంతో యూకే (ఐర్లాండ్, ఇంగ్లాండ్) పర్యటనలో గంభీర్ మార్క్ ఆల్ రౌండర్ వ్యూహం పూర్తిగా విఫలమైంది. నితీష్ కుమార్ రెడ్డి గాయపడటంతో సూర్యాంశ్ షెడ్గేను జట్టులోకి తీసుకున్నారు. శివమ్ దూబేను పూర్తిస్థాయి ఆల్ రౌండర్గా ఆడించేందుకు ప్రయత్నించారు. అటు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్లపై కూడా తీవ్రమైన భారం పడింది.
ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లు బంతితో ఆకట్టుకోలేకపోవడంతో అక్షర్, సుందర్, హర్షిత్ రాణాలపై బ్యాటింగ్ భారం కూడా పడింది. ఫలితంగా ఈ ముగ్గురూ తీవ్రమైన పనిభారానికి గురయ్యారు. ఈ క్రమంలోనే సుందర్, హర్షిత్ రాణాలు గాయపడి ఇంగ్లాండ్ సిరీస్కే దూరమయ్యారు. ఆల్ రౌండర్లుగా చెప్పుకున్న వారెవరూ సమర్థవంతంగా రాణించకపోవడంతో అసోసియేట్ దేశమైన ఐర్లాండ్, ఆపై ఇంగ్లాండ్ చేతుల్లో పొట్టి ఫార్మాట్ లో పరాజయం పాలై భారత్ తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది.
యూకేలో ఎదురైన పరాభవాల తర్వాత జింబాబ్వే పర్యటనకు బాధ్యతలు చేపట్టిన తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లు రూట్ మార్చారు. గంభీర్ లాగా అతిగా ఆల్ రౌండర్లపై ఆధారపడకుండా పాత పద్ధతిలోనే ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగారు. జట్టులో ఏకైక ఆల్ రౌండర్గా శివమ్ దూబేకు మాత్రమే చోటు కల్పించారు.
తొలి టీ20లో దూబే బౌలింగ్లో 4 ఓవర్లలో 32 రన్స్ ఇచ్చి వికెట్ తీయనప్పటికీ, మిగిలిన నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లు అద్భుతంగా రాణించి జింబాబ్వేను 125 రన్లకే పరిమితం చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్లో లభించిన స్వేచ్ఛతో వైభవ్ సూర్యవంశీ కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం బాది సంచలనం సృష్టించాడు. భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..