Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ కాదు.. మూడు ఫార్మాట్లకు అతడే కరెక్ట్ ఓపెనర్.. సెహ్వాగ్ ఓపెన్ స్టేట్‌మెంట్

Vaibhav Suryavanshi : రోహిత్ శర్మ తర్వాత మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు యశస్వి జైస్వాలే సరైన ఓపెనర్ అని వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ పోటీ ఉన్నప్పటికీ జైస్వాల్ భవిష్యత్ స్టార్‌గా నిలుస్తాడని పేర్కొన్నాడు.

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ కాదు.. మూడు ఫార్మాట్లకు అతడే కరెక్ట్ ఓపెనర్.. సెహ్వాగ్ ఓపెన్ స్టేట్‌మెంట్
Vaibhav Suryavanshi

Updated on: Jun 14, 2026 | 1:26 PM

Vaibhav Suryavanshi : భారత క్రికెట్ జట్టులో ప్రస్తుతం ఓపెనర్ల స్థానాల కోసం విపరీతమైన పోటీ నడుస్తోంది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. అయితే, టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం అందరి రూట్‌కు భిన్నంగా ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. భవిష్యత్తులో మూడు ఫార్మాట్లలోనూ (టెస్ట్, వన్డే, టీ20) భారతదేశానికి శాశ్వత ఓపెనర్‌గా రాణించగల సత్తా రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌కు మాత్రమే ఉందని సెహ్వాగ్ స్పష్టం చేశాడు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మకు అతడే సరైన వారసుడని వీరూ పేర్కొన్నాడు.

యశస్వి జైస్వాల్ ప్రస్తుతం భారత టెస్టు జట్టులో కేఎల్ రాహుల్‌తో కలిసి రెగ్యులర్ ఓపెనర్‌గా అదరగొడుతున్నాడు. కానీ, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వచ్చేసరికి అతనికి అవకాశాలు రావడం చాలా కష్టంగా మారింది. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో రోహిత్ శర్మతో పాటు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా స్థిరపడిపోయారు. అటు టీ20ల్లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మల జోడి సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతోంది. ఈ కారణాల వల్ల జైస్వాల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కేవలం బ్యాకప్ ఓపెనర్‌గా మాత్రమే మిగిలిపోవాల్సి వస్తోందని సెహ్వాగ్ విశ్లేషించాడు.

భారత్, అఫ్గానిస్తాన్ వన్డే మ్యాచ్ సందర్భంగా సెహ్వాగ్ క్రిక్‌బజ్ టాక్ షోలో మాట్లాడుతూ.. జైస్వాల్‌కు జట్టులో చోటు దక్కకపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. “ప్రస్తుతం వన్డే జట్టులో జైస్వాల్‌కు స్థానం లేదు. ఎందుకంటే అక్కడ కెప్టెన్ గిల్, సీనియర్ రోహిత్ శర్మ ఉన్నారు. కానీ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డేల నుంచి తప్పుకున్న వెంటనే వైట్ బాల్ క్రికెట్‌లో జైస్వాల్ శాశ్వత స్థానాన్ని సంపాదిస్తాడు. ఆ సమయంలో రుతురాజ్ గైక్వాడ్ నుంచి అతనికి కొంత పోటీ ఎదురైనా.. సెలెక్టర్లు ముగ్గురు ఓపెనర్లను ఎంపిక చేయాల్సి వస్తే అందులో ఖచ్చితంగా జైస్వాల్ పేరు మొదటి వరుసలో ఉంటుంది” అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

జైస్వాల్‌ను జట్టు నుంచి దూరం పెట్టడం అతని ఆటతీరు వల్ల కాదని సెహ్వాగ్ గుర్తుచేశాడు. “జైస్వాల్ వన్డే జట్టులోకి వచ్చింది కేవలం రోహిత్ లేదా గిల్ అందుబాటులో లేనప్పుడే. అలా వచ్చిన అవకాశాల్లో కూడా అతను అద్భుతంగా రాణించాడు. ఇప్పటివరకు ఆడిన 4 వన్డేల్లోనే ఒక సెంచరీ (116 పరుగులు) సాయంతో 171 రన్స్ చేశాడు. అంటే అతను ఫెయిల్ అయ్యాడని ఎవరూ డ్రాప్ చేయలేదు. కేవలం సీనియర్లు జట్టులోకి రావడం వల్లే అతను పక్కన కూర్చోవాల్సి వచ్చింది” అని జైస్వాల్‌కు మద్దతుగా మాట్లాడాడు.

భవిష్యత్ ఓపెనర్ల రేసులో జైస్వాల్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా బలమైన పోటీదారుడే అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ కొట్టిన రికార్డు ఇషాన్ కిషన్ పేరిట ఉంది. ప్రస్తుతం అతను కూడా వన్డే జట్టులో రెగ్యులర్ ప్లేయర్ కాదు. అయినప్పటికీ, లాంగ్ రన్‌ను దృష్టిలో పెట్టుకుంటే టెక్నిక్, దూకుడు కలగలిసిన యశస్వి జైస్వాల్ మూడు ఫార్మాట్లలోనూ భారతదేశానికి ఓపెనర్‌గా ఆడటం తాను చూడాలనుకుంటున్నట్లు సెహ్వాగ్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us