
IPL 2026: మరో 6 రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ఘనంగా ప్రారంభం కానుంది. అన్ని జట్లు మైదానంలో కఠోర శ్రమ చేస్తున్న తరుణంలో, టీం ఇండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మార్చి 28వ తేదీన జరగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య తొలి మ్యాచ్ను సాధారణ ఐపీఎల్ మ్యాచ్లా చూడవద్దని, దానిని భారత్ వర్సెస్ పాకిస్తాన్ పోరులా భావించాలని ఆయన పిలుపునివ్వడం గమనార్హం.
ఈ వివాదానికి ప్రధాన కారణం సన్రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ తీసుకున్న ఒక నిర్ణయం. ‘ది 100 లీగ్’ వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను ఆమె సుమారు రూ. 2.34 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. భారతదేశంలో సంపాదించిన సొమ్మును పాకిస్తాన్ ఆటగాళ్ల కోసం ఖర్చు పెట్టడంపై సోషల్ మీడియాలో అభిమానులు ఇప్పటికే మండిపడుతున్నారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించారు.
హైదరాబాద్ జట్టుకు అభిమానులు ఎవరూ ఉండరని, మార్చి 28న స్టేడియం అంతా ఆర్సీబీ రంగులతో నిండిపోతుందని సెహ్వాగ్ ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్న తీరును ఆయన తప్పుబడుతూ, ఈ ఐపీఎల్ మ్యాచ్ను జాతీయవాద కోణంలో చూడాలని కోరారు. పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేయడం ద్వారా కావ్య మారన్ భారత ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు.
ఐపీఎల్ చరిత్రలోనే తొలి మ్యాచ్కి ఇంతటి చర్చ జరగడం ఇదే మొదటిసారి. సెహ్వాగ్ వ్యాఖ్యల తర్వాత ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ పోరుకు కేవలం క్రీడా పరంగానే కాకుండా, భావోద్వేగ పరంగా కూడా ప్రాధాన్యత పెరిగింది. మరి ఈ వివాదం మైదానంలో ఆటపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..