
ROKO : న్యూజిలాండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ టీమిండియాకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఇండోర్ వేదికగా జరిగిన చివరి వన్డేలో భారత్ 41 పరుగుల తేడాతో ఓడిపోవడమే కాకుండా, సిరీస్ను 2-1తో కివీస్కు అప్పగించింది. ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ను కనబరిచినప్పటికీ, రోహిత్ శర్మ మాత్రం బ్యాటింగ్లో విఫలమయ్యాడు. నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో విరాట్ తన 54వ వన్డే సెంచరీ (124 పరుగులు) బాదినప్పటికీ, ఇతర ఆటగాళ్ల సహకారం లేక భారత్ చారిత్రాత్మక ఓటమిని మూటగట్టుకుంది.
రోహిత్, విరాట్ మళ్ళీ ఎప్పుడు ఆడతారు?
టెస్టులు, టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఈ దిగ్గజ ద్వయం కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కనిపిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. వీరు మళ్ళీ భారత జెర్సీలో కనిపించాలంటే ఈ ఏడాది జూన్ వరకు నిరీక్షించాల్సిందే. ప్రస్తుతం న్యూజిలాండ్తో జరగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో వీరు భాగం కాదు. వచ్చే నెలలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2026కు సన్నద్ధమవుతున్న తరుణంలో, కోహ్లీ మరియు రోహిత్ కొంతకాలం అంతర్జాతీయ క్రికెట్కు విరామం తీసుకోనున్నారు.
అఫ్గానిస్థాన్తో తదుపరి పోరు
ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (2023-27) ప్రకారం.. ఈ ఏడాది జూన్లో అఫ్గానిస్థాన్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగే మూడు వన్డేల సిరీస్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మళ్ళీ మైదానంలోకి దిగనున్నారు. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఆ తర్వాత జూలై 14 నుంచి జూలై 19 వరకు ఇంగ్లాండ్లో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో కూడా వీరు పాల్గొంటారు. ఎడ్జ్బాస్టన్ నుంచి లార్డ్స్ వరకు జరిగే ఈ సిరీస్ భారత జట్టుకు అత్యంత కీలకం కానుంది.
మధ్యలో ఐపీఎల్ హంగామా
అంతర్జాతీయ మ్యాచ్లకు విరామం ఉన్నప్పటికీ, మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026లో విరాట్, రోహిత్ తమ సత్తా చాటనున్నారు. విరాట్ కోహ్లీ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున బరిలోకి దిగుతుండగా, రోహిత్ శర్మ ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ తరపున ఆడనున్నాడు. అంతర్జాతీయ వన్డేల కంటే ముందే అభిమానులు తమ ఫేవరెట్ హీరోలను ఐపీఎల్ రంగురంగుల జెర్సీల్లో చూసి ఆనందించవచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..