
Virat Kohli angry reaction vs MI: వాంఖడే స్టేడియంలో ముంబైతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు బ్యాటర్లు ఆరంభం నుంచి మెరుపులు మెరిపించారు. ఫిలిప్ సాల్ట్, రజత్ పాటీదార్ ధాటిగా ఆడి అర్థ సెంచరీలు సాధించగా, కోహ్లీ మాత్రం పరుగుల కోసం ఇబ్బంది పడ్డాడు. 38 బంతుల్లో 50 పరుగులు చేసిన విరాట్, తన శైలికి విరుద్ధంగా నెమ్మదిగా ఆడాడనే విమర్శలు వ్యక్తమయ్యాయి. 15 ఓవర్లు ముగిసిన తర్వాత కోహ్లీ గేర్ మారుస్తాడని అభిమానులు ఆశించినా, హార్దిక్ పాండ్య వేసిన ఒక సాధారణ లో-ఫుల్ టాస్ బంతికి సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి విరాట్ వెనుదిరిగాడు.
మైదానంలో ఎంతో ఉద్వేగంగా ఉండే కోహ్లీ, అవుట్ అయిన తర్వాత తనపై తనే కోపం పెంచుకున్నాడు. అనవసరమైన బంతికి వికెట్ సమర్పించుకున్నాననే బాధలో బౌండరీ లైన్ వద్ద ఉన్న కుషన్లపై గ్లోవ్స్ను విసిరికొట్టాడు. అక్కడితో ఆగకుండా తన హెల్మెట్ను కూడా నేలకేసి కొట్టడంతో స్టేడియంలో ఉన్న వారంతా నిశ్చేష్టులయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వ్యాపిస్తున్నాయి. కోహ్లీ ప్రవర్తన క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కొందరు అభిప్రాయపడుతున్నారు.
After Virat Kohli got out, he was very angry 😒😓 pic.twitter.com/mASpSLpp7n
— Virat Kohli 18 (@viratkohlifc518) April 12, 2026
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం మైదానంలో క్రీడా సామగ్రిని (బ్యాట్, హెల్మెట్, గ్లోవ్స్) కోపంతో విసిరికొట్టడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఇది ‘లెవల్ 1’ లేదా ‘లెవల్ 2’ నేరం కింద పరిగణించబడే అవకాశం ఉంది. గతంలో ఇలాంటి చర్యలకు పాల్పడిన ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 25 నుంచి 100 శాతం వరకు జరిమానా విధించిన సందర్భాలు ఉన్నాయి. బీసీసీఐ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటే కోహ్లీకి భారీ జరిమానాతో పాటు డెమెరిట్ పాయింట్లు కూడా పడే అవకాశం ఉంది.
బ్యాటింగ్తో నిరాశపరచడమే కాకుండా, ఈ మ్యాచ్లో కోహ్లీ రెండు రివ్యూలను (DRS) వృథా చేయడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం వైడ్ బంతుల కోసం రెండు రివ్యూలను వాడటం జట్టు ప్రయోజనాలను దెబ్బతీసే చర్య అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కోహ్లీ తన వ్యక్తిగత స్కోరు కోసం లేదా పంతం కోసం ఇలా రివ్యూలను వృథా చేస్తూ స్వార్థంగా వ్యవహరిస్తున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..