
భారత క్రికెట్ను మార్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తొలి ఛైర్మన్ లలిత్ మోడీ మళ్లీ ప్రేమలో పడ్డాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా తన కొత్త ప్రేమను ప్రపంచానికి ప్రకటించాడు. రిమా బౌరీ అనే మహిళ తన జీవితంలో కొత్త భాగస్వామిగా మారిందని, వారి 25 ఏళ్ల స్నేహం ప్రేమగా మారిందని లలిత్ వెల్లడించాడు.
ఇన్స్టాగ్రామ్లో రీమాతో ఉన్న అనేక ఫొటోలు షేర్ చేసిన మోడీ, 25 ఏళ్ల స్నేహం ప్రేమగా మారినప్పుడు. మీ అందరికీ అలాగే జరుగుతుందని ఆశిస్తున్నాను. #HappyValentinesDay అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. రిమా ఆ పోస్ట్పై స్పందిస్తూ “నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాను” అని పోస్ట్ కింద కామెంట్ చేసింది.
రిమా బౌరీ లెబనాన్లో స్థిరపడిన స్వతంత్ర కన్సల్టెంట్. ఆమె మార్కెటింగ్ రంగంలో మంచి అనుభవం కలిగి ఉంది. తన వ్యక్తిగత జీవితం గురించి మోడీ స్పష్టత ఇవ్వడం కొత్త విషయం కాదు. 2022లో బాలీవుడ్ నటి సుష్మితా సేన్తో డేటింగ్ చేస్తున్నానని ప్రకటించాడు. కానీ అప్పుడు పెళ్లి కాలేదని స్పష్టం చేశాడు.
లలిత్ మోడీ మినాల్ సంగ్రానిని వివాహం చేసుకున్నాడు. ఈ జంట 27 సంవత్సరాలు కలిసి జీవించింది. కానీ 2018లో క్యాన్సర్ కారణంగా మినాల్ మృతి చెందింది. ఈ దంపతులకు అలియా, రుచిర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
2010లో పన్ను ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణల కారణంగా మోడీ భారత్ను వదిలి లండన్కు వెళ్లిపోయాడు. 2013లో BCCI అతనిపై జీవితకాల నిషేధం విధించింది. అయితే, అప్పటి నుండి మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు.
ఇటీవల, మోడీ CSK యజమాని ఎన్. శ్రీనివాసన్ పై సంచలన ఆరోపణలు చేశాడు. IPL రెండవ సీజన్ వేలంలో బిడ్ రిగ్గింగ్ జరిగింది అని చెప్పాడు. “ఆండ్రూ ఫ్లింటాఫ్ను CSKకి ఇచ్చేందుకు IPL పాలకమండలి బిడ్ రిగ్గింగ్ చేసింది” అని పేర్కొన్నాడు.
మోడీ మాట్లాడుతూ, “శ్రీనివాసన్ కోరిక మేరకు ఫ్లింటాఫ్ను CSKకి ఇచ్చాం. ఇది ప్రతి జట్టుకూ తెలుసు. శ్రీనివాసన్ IPLలో శక్తివంతమైన వ్యక్తి. అతను మా బోర్డులో ముల్లు లాంటి వాడు” అని పేర్కొన్నాడు.
ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. లలిత్ మోడీ జీవితం ప్రేమ, రాజకీయాలు, వివాదాలతో నిండి ఉంది. రిమాతో అతని కొత్త జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..