IPL Records: 10 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్ జోడీ.. ఐపీఎల్ హిస్టరీలోనే డేంజరస్ భయ్యో..!

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ మరియు యశస్వి జైస్వాల్ విధ్వంసం సృష్టిస్తున్నారు. బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా ఆడుతున్న ఈ భారతీయ యువ జోడీ, తాజాగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 500 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు పుస్తకాలను తిరగరాసింది. వీరిద్దరి ధాటికి దిగ్గజ ఓపెనర్ల రికార్డులు సైతం కనుమరుగయ్యాయి.

IPL Records: 10 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్ జోడీ.. ఐపీఎల్ హిస్టరీలోనే డేంజరస్ భయ్యో..!
Gt Vs Rr Vaibhav Sooryavanshi

Updated on: Apr 10, 2026 | 9:10 PM

Rajasthan Royals Opening Partnership: గువాహటి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న కీలక పోరుకు ముందు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు సంచలన గణాంకాలతో వార్తల్లో నిలిచారు. కేవలం 248 బంతుల్లోనే 500 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసి, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న భారతీయ జోడీగా గుర్తింపు పొందారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వీరు ఆడిన ఇన్నింగ్స్ బౌలర్లకు పీడకలగా మారింది. కేవలం 11 ఓవర్ల మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్ 14 బంతుల్లో 39 పరుగులు చేయగా, యశస్వి 32 బంతుల్లో 77 పరుగులతో విరుచుకుపడ్డారు.

సెహ్వాగ్ – గంభీర్ రికార్డులు బద్ధలు..

గతంలో ఢిల్లీ ఫ్రాంచైజీ తరపున వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ 309 బంతుల్లో 500 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దశాబ్ద కాలంగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును వైభవ్ – యశస్వి జోడీ కేవలం 248 బంతుల్లోనే అధిగమించడం విశేషం. అయితే ఓవరాల్‌గా చూస్తే, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ అత్యంత వేగవంతమైన 500 పరుగుల రికార్డులో ఇంకా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

బౌలర్లకు సింహస్వప్నంలా వైభవ్ – జైస్వాల్..

ఈ సీజన్‌లో రాజస్థాన్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఈ ఓపెనింగ్ జోడీ అర్ధ సెంచరీ భాగస్వామ్యాలను నమోదు చేయడం విశేషం. 15 ఏళ్ల అద్భుత ప్రతిభావంతుడు వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు 10 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 218.72 స్ట్రైక్ రేట్‌తో 374 పరుగులు సాధించాడు. ఇందులో కేవలం 35 బంతుల్లోనే నమోదైన సెంచరీ కూడా ఉంది. మరోవైపు, యశస్వి జైస్వాల్ 69 మ్యాచ్‌ల్లో 2,356 పరుగులతో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు.

అజేయంగా రాజస్థాన్ రాయల్స్..

ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్లుగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనసాగుతున్నాయి. నేడు జరగబోయే పోరులో ఏ జట్టుకు మొదటి ఓటమి ఎదురవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా జైస్వాల్, వైభవ్ ల మెరుపు ఆరంభాలను బెంగళూరు బౌలర్లు ఎలా అడ్డుకుంటారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రికార్డు ఉన్న యశస్వి, సరికొత్త సెన్సేషన్ వైభవ్ కలిసి రాజస్థాన్‌ను మరోసారి విజయపథంలో నడిపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us