
Vaibhav Suryavanshi : టీమిండియా నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్, 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026లో భారత్ను ఛాంపియన్గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన ఈ కుర్రాడు, తన కలల కోసం ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియా సీనియర్ జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న వైభవ్, తనకి ఎంతో ఇష్టమైన మటన్, చికెన్ తినడం పూర్తిగా మానేశాడు. వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్పై కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన వైభవ్, ఇప్పుడు తన ఫోకస్ మొత్తం ఫిట్నెస్ మీద పెట్టాడు. సీనియర్ టీమ్లోకి రావాలంటే కేవలం ఫామ్ ఉంటే సరిపోదు, అద్భుతమైన ఫిట్నెస్ కూడా ఉండాలని భావించి తన డైట్లో భారీ మార్పులు చేసుకున్నాడు.
వైభవ్ చిన్నప్పటి నుంచి మటన్, చికెన్ అంటే ప్రాణం ఇచ్చేవాడు. ఎంత పెట్టినా కాదనకుండా తినేవాడు. కానీ ఇప్పుడు తన లక్ష్యం కోసం వాటిని పక్కన పెట్టేసి పప్పు, ఆకుకూరలు, పనీర్ వంటి శాకాహార భోజనానికి మారిపోయాడు. జంక్ ఫుడ్ (పిజ్జా వంటివి) కూడా పూర్తిగా మానేశాడు. రాజస్థాన్ రాయల్స్ ట్రైనింగ్ క్యాంప్లో ఐపీఎల్ 2026 కోసం సిద్ధమవుతున్న వైభవ్, తన బరువును అదుపులో ఉంచుకుంటూ మరింత వేగంగా, చురుగ్గా మారేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు.
సీనియర్ టీమ్లోకి ఎంట్రీ ఎప్పుడు?
వైభవ్ కోచ్ మనీష్ ఓజా, తండ్రి సంజీవ్ ఇద్దరూ కూడా వైభవ్ సీనియర్ టీమ్కు సిద్ధంగా ఉన్నాడని నమ్ముతున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం సీనియర్ అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే కనీసం 15 ఏళ్లు నిండాలి. ఐపీఎల్ 2026 తర్వాత వైభవ్ టీమిండియా టీ20 జట్టులోకి వచ్చే అవకాశం ఉందని కోచ్ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఆ సమయానికి అతనికి 15 ఏళ్లు నిండుతాయి. “నా కొడుకు సిద్ధంగా ఉన్నాడు, ఇక బీసీసీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది” అని సంజీవ్ సూర్యవంశీ గర్వంగా చెబుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..