
Vaibhav Suryavanshi: పరిమిత ఓవర్ల (వైట్ బాల్) క్రికెట్లో ఎన్నో ప్రపంచ రికార్డులు సృష్టించిన భారత యంగ్ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్లో తన బ్యాటింగ్ టాలెంట్ ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నాడు. ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ టోర్నమెంట్లో వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం నాగ్పూర్ సమీపంలోని తలేగావ్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ అకాడమీలో టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ మార్గదర్శకత్వంలో తన రెడ్ బాల్ ఆటతీరుకు పదను పెడుతున్నాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ గణాంకాలు
వైభవ్ సూర్యవంశీ 2024 జనవరి 5న పాట్నా వేదికగా ముంబైతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ ద్వారా బీహార్ తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో అతని వయస్సు కేవలం 12 సంవత్సరాల 284 రోజులు మాత్రమే. 1959-60లో ఎస్.కె.బోస్ తర్వాత రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన రెండో అతి పిన్న వయస్కుడిగా, అలాగే 1986 తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన అతిపిన్న భారతీయ ఆటగాడిగా రికార్డుకెక్కాడు.
మ్యాచ్లు/ఇన్నింగ్స్లు: 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 12 ఇన్నింగ్స్లు
పరుగులు, సగటు: 17.25 సగటుతో 207 పరుగులు
అత్యధిక స్కోరు: 93 పరుగులు (మేఘాలయపై 67 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో సాధించాడు)
స్ట్రైక్ రేట్: రెడ్ బాల్ క్రికెట్లో అత్యధికంగా భావించే 90 స్ట్రైక్ రేట్తో పరుగులు చేయడం విశేషం. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన సెంచరీ కొట్టిన ప్లేయర్ అయిన ధృవ్ పాండోవ్ 37 ఏళ్ల పాత రికార్డును బ్రేక్ చేయడానికి వైభవ్ కేవలం 7 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
ఇండియా అండర్-19 టెస్టుల్లో ఆల్టైమ్ ప్రదర్శన
భారత అండర్-19 యువ టెస్ట్ జట్టు తరఫున వైభవ్ ప్రదర్శన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కంటే ఎంతో మెరుగ్గా ఉంది. ఇప్పటివరకు 6 అండర్-19 టెస్టులు ఆడిన ఆయన 33.10 సగటుతో 331 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 2 అద్భుతమైన సెంచరీలు ఉన్నాయి.
తొలి సెంచరీ: సెప్టెంబర్ 2024లో చెన్నైలో ఆస్ట్రేలియా అండర్-19పై తన అరంగేట్ర మ్యాచ్లోనే కేవలం 58 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇది యువ టెస్టుల్లో ఒక భారతీయుడు చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీగా రికార్డు సృష్టించింది.
రెండో సెంచరీ: ఒక సంవత్సరం తర్వాత ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ గడ్డపై ఆసీస్ U-19 పైనే 86 బంతుల్లో 113 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా అండర్-19పై 40.16 సగటు, ఆస్ట్రేలియా గడ్డపై 44.33 సగటు నమోదు చేసిన సూర్యవంశీ, బంతి ఎక్కువగా స్వింగ్ అయ్యే ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన రెండు యువ టెస్టుల్లో మాత్రం 22.50 సగటుతో పరుగులు సాధించాడు.
టి20ల్లో ఇప్పటికే ప్రపంచ రికార్డుల మోత
రెడ్ బాల్ క్రికెట్లో ఇంకా నిలదొక్కుకుంటున్నప్పటికీ, వైట్ బాల్ సీనియర్ లెవెల్ క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే తన అద్భుత ముద్ర వేశాడు. జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్ల అంతర్జాతీయ టి20 సిరీస్లో ఏకంగా 5 ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పుడు దులీప్ ట్రోఫీ ద్వారా తనను తాను రెడ్ బాల్ ఫార్మాట్లోనూ నిరూపించుకోవాలని భావిస్తున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..