Vaibhav Sooryavanshi : టీమిండియాలోకి వండర్ కిడ్.. రోహిత్ శర్మ అరంగేట్రం చేసిన మైదానంలోనే వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ

Vaibhav Sooryavanshi : టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. విశేషమేమిటంటే రోహిత్ శర్మ 2007లో డెబ్యూ చేసిన బెల్ఫాస్ట్ మైదానంలోనే వైభవ్ కూడా తన తొలి మ్యాచ్ ఆడే అవకాశం ఉండటం ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Vaibhav Sooryavanshi : టీమిండియాలోకి వండర్ కిడ్.. రోహిత్ శర్మ అరంగేట్రం చేసిన మైదానంలోనే వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ
Vaibhav

Updated on: Jun 22, 2026 | 1:25 PM

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ జట్టులో సరికొత్త సంచలనం నడుస్తోంది. అఫ్గానిస్థాన్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన తర్వాత.. టీమిండియా ఇప్పుడు ఐర్లాండ్ పర్యటనకు సిద్ధమైంది. ఈ పర్యటనలో భారత్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. ఈ పర్యటన ద్వారా టీమిండియాకు కొత్త టీ20 కెప్టెన్ లభించడంతో పాటు, వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయబోతున్నాడు.

ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఆటతీరుతో కళ్లు చెదిరే ప్రదర్శన చేశాడు. సీజన్ మొత్తం మీద లీగ్‌లో ఏకంగా 700 కంటే ఎక్కువ పరుగులు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. అతనిలోని పవర్‌ఫుల్ హిట్టింగ్ సామర్థ్యాన్ని గుర్తించిన సెలెక్టర్లు.. రాబోయే ఐర్లాండ్ పర్యటనతో పాటు ఆ తర్వాత జరగబోయే ఇంగ్లాండ్ పర్యటనకు సంబంధించిన టీ20 జట్టుకు కూడా వైభవ్‌ను ఎంపిక చేశారు. ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కితే క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర క్రియేట్ అవ్వనుంది.

ఈ అరంగేట్రంలో ఒక ఆసక్తికరమైన కాకతాళీయం దాగి ఉంది. వైభవ్ సూర్యవంశీ తన కెరీర్ లో మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌ను ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్ నగరంలో ఉన్న సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో ఆడబోతున్నాడు. సరిగ్గా 19 ఏళ్ల క్రితం అంటే 2007వ సంవత్సరంలో భారత దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ కూడా తన అంతర్జాతీయ కెరీర్ తొలి వన్డే మ్యాచ్‌ను ఇదే బెల్ఫాస్ట్ మైదానంలో ఐర్లాండ్‌పైనే ఆడాడు. దీంతో రోహిత్ కెరీర్ ప్రారంభమైన పిచ్‌ పైనే వైభవ్ కెరీర్ కూడా ప్రారంభం కానుండటం విశేషం.

రోహిత్ శర్మ 2007లో బెల్ఫాస్ట్‌లో డెబ్యూ చేసినప్పుడు అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఆ మ్యాచ్‌లో ఐర్లాండ్ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఓపెనర్లు సౌరవ్ గంగూలీ, గౌతమ్ గంభీర్ అద్భుత ఇన్నింగ్స్‌ల సహాయంతో ఒకే ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించడంతో రోహిత్ నాన్-బ్యాటింగ్ డెబ్యూగా మిగిలిపోయింది. కానీ వైభవ్ సూర్యవంశీ విషయంలో అలా జరగదు. ఎందుకంటే వైభవ్ జట్టులో స్పెషలిస్ట్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నాడు. కాబట్టి మొదటి మ్యాచ్‌లోనే అతనికి బ్యాటింగ్ చేసే పూర్తి అవకాశం లభిస్తుంది.

భారత్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఇందులో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ జూన్ 26న, రెండో టీ20 మ్యాచ్ జూన్ 28న జరగనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లకు కూడా బెల్ఫాస్ట్ మైదానమే ఆతిథ్యం ఇవ్వనుంది. బెల్ఫాస్ట్ పిచ్ కండిషన్స్ వైభవ్ సూర్యవంశీ ఆడే సూపర్ ఫాస్ట్ ఆటతీరుకు సరిగ్గా సరిపోతాయని టెక్నికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌లలో కనుక వైభవ్ రాణిస్తే అతని అంతర్జాతీయ కెరీర్‌కు తిరుగులేని ఆరంభం లభిస్తుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us