
Vaibhav Sooryavanshi Bat Sponsorship: భారత క్రికెట్లో మరో మహా సంచలనం నమోదైంది. కేవలం పదిహేనేళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దిగ్గజాల రికార్డులను ముక్కలు చేస్తూ ఒక కుర్రాడు సృష్టిస్తున్న ప్రభంజనం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల వరద పారిస్తూ, బ్రాండ్ వాల్యూలో విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్లకే సవాల్ విసురుతున్న ఆ యువ కిరటంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల విధ్వంసం సృష్టిస్తున్నాడు. మైదానంలోకి దిగితే చాలు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఏకంగా 680 పరుగులు సాధించి అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు బాది క్రికెట్ ప్రపంచాన్ని ఊపిరి సలపకుండా చేశాడు. ఈ క్రమంలోనే ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును సైతం ఈ కుర్రాడు బద్దలు కొట్టడం విశేషం.
వైభవ్ సూర్యవంశీ కేవలం మైదానంలోనే కాదు, మార్కెట్ ప్రపంచంలోనూ సునామీ సృష్టిస్తున్నాడు. నిన్నటివరకు అంతగా గుర్తింపు లేని ఈ ఆటగాడి బ్రాండ్ వాల్యూ ఇప్పుడు రోజురోజుకూ ఆకాశాన్నంటుతోంది. భవిష్యత్తులో విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాల రికార్డులను, వారి క్రేజ్ను అధిగమించగల ఏకైక ఆటగాడు వీడేనని క్రీడా విశ్లేషకులు గట్టిగా చెప్తున్నారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ప్రదర్శనతో మార్కెట్ డిమాండ్లో ఎంతోమంది సీనియర్ స్టార్ ఆటగాళ్లను ఈ కుర్రాడు ఎప్పుడో వెనక్కి నెట్టేశాడు.
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వాడుతున్న బ్యాట్ స్పాన్సర్షిప్ ఒప్పందం విలువ కేవలం ఏడాదికి 50 లక్షల రూపాయలు మాత్రమే. ఈ ఐపీఎల్ సీజన్తో ఆ ఒప్పందం ముగియనుంది. దీంతో భారత్లోని ప్రముఖ టైర్ల తయారీ సంస్థలైన ఎంఆర్ఎఫ్, సీయట్ వంటి బడా కంపెనీలు ఈ కుర్రాడితో ఒప్పందం కోసం పోటీ పడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, తదుపరి బ్యాట్ ఒప్పందం కోసం వైభవ్కు ఏడాదికి 12 కోట్ల రూపాయలకు పైగా ఆఫర్లు వస్తున్నాయి. విస్మయకరమైన విషయం ఏంటంటే, ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఈ యువ సంచలనానికి ఏకంగా ‘బ్లాంక్ చెక్’ ఆఫర్ ఇచ్చిందట..! అంటే ఎంత మొత్తమైనా రాసుకోమని, తమ బ్రాండ్తో ఒప్పందం చేసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. సాధారణ బ్యాట్ తయారీ సంస్థలు 5 కోట్ల వరకు మాత్రమే ఆఫర్ ఇవ్వగలవు కాబట్టి, ఈ కార్పొరేట్ రేసులో ఆ సంస్థలు వెనుకబడిపోయాయి.
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ కేవలం భవిష్యత్తులో భారత క్రికెట్ను శాసించే ఆటగాడిగా కనిపించడం లేదు, ప్రస్తుత కాలంలోనే అతడు సామ్రాజ్యాన్ని మొదలుపెట్టేశాడు. క్రికెట్ అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ 15 ఏళ్ల వండర్ కిడ్, తన తదుపరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో జరిగే క్వాలిఫైయర్ 2 పోరుకు సిద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్లో కూడా రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ మరోసారి బ్యాట్తో రెచ్చిపోతే, అతని క్రేజ్, మార్కెట్ వాల్యూ ఊహించని స్థాయికి చేరడం ఖాయం.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..