Tilak Varma : మైదానంలో నా స్ట్రాటజీ వేరు.. విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తిలక్ వర్మ

Tilak Varma : స్ట్రైక్‌రేట్‌పై వస్తున్న విమర్శలకు తిలక్ వర్మ ఘాటుగా స్పందించాడు. జట్టు అవసరాలకు అనుగుణంగానే తాను బ్యాటింగ్ చేస్తానని స్పష్టం చేసిన హైదరాబాద్ యువ బ్యాటర్, జింబాబ్వే సిరీస్‌లో టీమిండియా మళ్లీ గెలుపు బాట పట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు.

Tilak Varma : మైదానంలో నా స్ట్రాటజీ వేరు.. విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తిలక్ వర్మ
Tilak Varma (2)

Updated on: Jul 22, 2026 | 9:16 AM

Tilak Varma : ఇటీవల విదేశీ పర్యటనల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు వైట్-బాల్ క్రికెట్‌లో ఊహించని పరాజయాలను చవిచూసింది. మొదట ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్‌ను 0-2తో కోల్పోగా, ఆ తర్వాత బలమైన ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-4తో, అనంతరం జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తో చేజార్చుకుంది. ఈ వరుస ఓటములు భారత జట్టులోని పలు లోపాలను ఎత్తిచూపడమే కాకుండా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల నెమ్మదిగా ఆడే విధానంపై పెద్ద ఎత్తున విమర్శలకు దారితీశాయి.

విమర్శల గుప్పిట్లో తిలక్ వర్మ

ఈ వైఫల్యాల క్రమంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్, హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ తన స్ట్రైక్ రేట్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఐర్లాండ్ పర్యటనలో రెండు మ్యాచ్‌లలో 37 సగటుతో 74 పరుగులు చేసి జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచినా, వేగంగా ఆడలేకపోయాడన్న విమర్శలు వచ్చాయి. ఇక ఇంగ్లాండ్‌పై ఐదు టీ20 మ్యాచ్‌లలో 26 సగటుతో 104 పరుగులు సాధించినప్పటికీ, మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు ఒక స్పెషలిస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నుంచి ఆశించిన స్థాయిలో అతడి బ్యాటింగ్ సాగలేదు.

గట్టిగా బదులిచ్చిన తిలక్

జూలై 23 నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో తిలక్ వర్మ స్పందించాడు. తన స్ట్రైక్ రేట్‌పై వస్తున్న విమర్శలను అతడు పూర్తిగా తిరస్కరించాడు. “ఈ ఫార్మాట్‌లో వేర్వేరు స్థానాల్లో, వేర్వేరు పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. నేను ఎప్పుడైనా జట్టు ప్రయోజనాల కోసమే ఆడతాను. క్రీజులో నిలబడి వికెట్ కాపాడుకోవాల్సి వస్తే అలాగే ఆడతాను, లేదా భారీ షాట్లు బాదాల్సి వస్తే దానికి తగినట్లే బ్యాటింగ్ చేస్తాను. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లను గమనిస్తే.. పవర్ ప్లేలోనే 4 వికెట్లు, తొలి 6 ఓవర్లలోనే 5 వికెట్లు పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు చివరి వరకు నిలబడి జట్టును ఆదుకోవడమే ప్రధాన వ్యూహంగా మారుతుంది” అని తిలక్ క్లారిటీ ఇచ్చాడు.

జింబాబ్వేపై విజయమే లక్ష్యం

గత సిరీస్‌లలో ఎదురైన ఓటములపై మాట్లాడిన తిలక్ వర్మ, ఆ చేదు అనుభవాల నుంచి చాలా నేర్చుకున్నామని తెలిపాడు. “జరిగిన దాన్ని వదిలేసి రాబోయే సిరీస్‌పైనే మేము దృష్టి పెట్టాం. మా ప్రాథమిక వ్యూహాలను సరిగ్గా అమలు చేసి మళ్లీ గెలుపు బాట పట్టడమే మా లక్ష్యం. ఆటగాళ్లందరూ ఈ మధ్యే దేశవాళీ క్రికెట్, ఇండియా-ఎ సిరీస్‌లు ఆడి మంచి ప్రాక్టీస్‌లో ఉన్నారు. కాబట్టి జింబాబ్వే సిరీస్‌కు మేమంతా పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మైదానం, వేదిక పెద్దది కావచ్చు కానీ మా ఆట తీరు మాత్రం ఒక్కటే” అని ధీమా వ్యక్తం చేశాడు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us