Asia Cup 2025: గ్రూప్ దశలో అదరగొట్టినా.. సూపర్-4లో గజగజ వణుకుతున్న టీమిండియా.. అసలెందుకు భయం ?

ఆసియా కప్ 2025లో భారత అజేయ పరంపర కొనసాగుతోంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు సూపర్-4 కోసం సిద్ధమవుతోంది. ఈ రౌండ్‌లో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. అయితే, టీ20 ఫార్మాట్‌లో సూపర్-4లో టీమిండియా రికార్డు చూస్తే అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.

Asia Cup 2025: గ్రూప్ దశలో అదరగొట్టినా.. సూపర్-4లో గజగజ వణుకుతున్న టీమిండియా.. అసలెందుకు భయం ?
Asia Cup 2025

Updated on: Sep 20, 2025 | 8:12 PM

Asia Cup 2025: ఆసియా కప్ 2025లో భారత జట్టు వరుసగా విజయాలు సాధిస్తూ అజేయంగా దూసుకుపోతోంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిచి, ఇప్పుడు సూపర్-4 దశకు చేరుకుంది. అయితే, టీ20 ఆసియా కప్ చరిత్రలో సూపర్-4 దశలో భారత్ రికార్డు అంత బాగాలేదు. ఈసారి కూడా అదే పునరావృతం అవుతుందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

రికార్డులు ఏం చెబుతున్నాయి?

ఆసియా కప్ 2025లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటోంది. గ్రూప్ దశలో యూఏఈ, పాకిస్తాన్, ఒమన్‎లపై విజయాలు సాధించి, సూపర్-4 దశకు అర్హత సాధించింది. కానీ, టీ20 ఆసియా కప్ చరిత్రలో సూపర్-4లో భారత రికార్డు అంతగా మెరుగ్గా లేదు. ఇది అభిమానులలో కొంత ఆందోళన కలిగిస్తోంది.

సూపర్-4లో భారత రికార్డు

టీ20 ఆసియా కప్ చరిత్రలో కేవలం ఒక్కసారి మాత్రమే సూపర్-4 ఫార్మాట్‌లో టోర్నమెంట్ నిర్వహించారు. అది 2022 టీ20 ఆసియా కప్. ఆ టోర్నీలో భారత జట్టు సూపర్-4లో మూడు మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచి, రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలై టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఈసారి భారత జట్టు పటిష్టంగా ఉన్నప్పటికీ, ఈ రికార్డును గుర్తు చేసుకుని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి భారత్ సెప్టెంబర్ 21న తన మొదటి సూపర్-4 మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి, గత రికార్డును మార్చాలని చూస్తోంది.

టీమిండియా ప్రస్తుత ఫామ్

గత రికార్డులు ఎలా ఉన్నా, ప్రస్తుత ఫామ్‌ను చూస్తే భారత జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఆడిన 22 టీ20 మ్యాచ్‌లలో 19 మ్యాచ్‌లు గెలిచింది. అలాగే, గత 42 టీ20 మ్యాచ్‌లలో 37 మ్యాచ్‌లు గెలిచి అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది.

సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో జట్టు స్థిరంగా రాణిస్తోంది. ఈ టోర్నమెంట్ వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచ కప్‌కు మంచి సన్నాహకంగా నిలుస్తోంది. గ్రూప్ దశలో యూఏఈని 9 వికెట్లతో, పాకిస్తాన్‌ను 7 వికెట్లతో, ఒమన్‎ను 21 పరుగులతో ఓడించి అద్భుతమైన ప్రదర్శనతో భారత్ ముందుకు సాగుతోంది. ఈసారి తప్పకుండా సూపర్-4లో మెరుగైన ప్రదర్శన చేసి, ఫైనల్‌కు చేరుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..