
Team India : ఐపీఎల్ 2026 (IPL 19) హడావుడి మొదలవ్వకముందే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీమిండియా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఏమాత్రం గ్యాప్ లేకుండా భారత జట్టు వరుస సిరీస్లతో బిజీ కానుంది. తాజాగా ఐర్లాండ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ ఖరారు చేసింది. దీంతో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్లతో కూడా తలపడనుంది. దాదాపు మూడేళ్ల తర్వాత భారత జట్టు మళ్ళీ ఐర్లాండ్ గడ్డపై అడుగుపెట్టబోతోంది. గతంలో 2018, 2022, 2023లో టీమిండియా అక్కడ పర్యటించింది. ఈసారి రెండు టీ20ల సిరీస్ కోసం బెల్ఫాస్ట్ వేదికగా మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి టీ20 జూన్ 26న, రెండో టీ20 జూన్ 28న నిర్వహించనున్నారు. ఐపీఎల్ లో మెరిసిన కుర్రాళ్లకు ఈ పర్యటనలో సత్తా చాటేందుకు మంచి అవకాశం దక్కనుంది.
రోహిత్, విరాట్ ఎన్ని మ్యాచ్లు ఆడతారు?
భారత దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాబట్టి వారు ఐర్లాండ్ సిరీస్ లో కనిపించరు. అయితే, ఐర్లాండ్ పర్యటనకు ముందు ఆఫ్ఘనిస్తాన్తో జరిగే 3 వన్డేల సిరీస్ (జూన్ 6 – జూన్ 20), ఐర్లాండ్ పర్యటన తర్వాత ఇంగ్లాండ్తో జరిగే 3 వన్డేల సిరీస్ (జూలై 1 – జూలై 19) లో రోహిత్, విరాట్ ఆడే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఐపీఎల్ తర్వాత ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు 6 వన్డే మ్యాచ్ల్లో కనిపిస్తారు.
ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ సిరీస్ల వివరాలు
ఐపీఎల్ ముగిసిన వెంటనే జూన్ 6 నుంచి జూన్ 20 వరకు ఆఫ్ఘనిస్తాన్తో టీమిండియా తలపడుతుంది. ఇందులో ఒక టెస్టు మ్యాచ్, మూడు వన్డేలు ఉంటాయి. ఆ వెంటనే ఐర్లాండ్ తో రెండు టీ20లు ముగించుకుని, భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరుతుంది. ఇంగ్లాండ్ టూర్లో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. జూన్, జూలై నెలలు క్రికెట్ అభిమానులకు అసలైన పండగలా మారబోతున్నాయి.
కుర్రాళ్లకు గోల్డెన్ ఛాన్స్
ఐర్లాండ్ సిరీస్ లో హార్దిక్ పాండ్యా లేదా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో యంగ్ టీమ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026లో అదరగొట్టిన టాప్ పర్ఫార్మర్లకు ఐర్లాండ్ పర్యటనకు పిలుపు వచ్చే ఛాన్స్ ఉంది. రోహిత్, విరాట్ వంటి సీనియర్లు లేకపోయినా, భారత్ కు ఉన్న బలమైన బెంచ్ స్ట్రెంత్ తో ఐర్లాండ్ ను చిత్తు చేయాలని టీమ్ ఇండియా భావిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..